టెస్కో టెండర్ విధానం వెంటనే రద్దు చేయాలి…

టెస్కో టెండర్ విధానం వెంటనే రద్దు చేయాలి

పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్రంలో వేలాది కుటుంబాలకు జీవనాధారమైన చేనేత పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ అన్నారు.

టెస్కో అమలు చేస్తున్న టెండర్ విధానం వల్ల చేనేత కార్మికులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.టెండర్ విధానం కారణంగా ధరల పోటీ పెరిగి మధ్యవర్తులు తక్కువ ధరలకు టెండర్‌లు పొందుతున్నారని తెలిపారు.

దీని ప్రభావం నేరుగా చేనేత కార్మికులపై పడుతూ వారికి దక్కాల్సిన కూలి తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే కార్మికులకు తగిన పారితోషికం అందక వారి జీవనోపాధి సంక్షోభంలో పడుతోందని అన్నారు.
అలాగే టెండర్ విధానం వల్ల మధ్యవర్తులు, పెద్ద కాంట్రాక్టర్ల ప్రాధాన్యం పెరిగి చేనేత కార్మికులు నేరుగా ప్రభుత్వ సంస్థలతో పనిచేసే అవకాశాలు తగ్గిపోతున్నాయని తెలిపారు.

చిన్న చేనేత సహకార సంఘాలు పోటీలో నిలబడలేక ఆర్థికంగా దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సరైన ఆదాయం లేకపోవడం వల్ల యువత చేనేత వృత్తి నుంచి దూరమవుతున్నారని, ఇది కొనసాగితే సంప్రదాయ చేనేత వృత్తి క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని క్యాతం సతీష్ కుమార్ హెచ్చరించారు.
ప్రభుత్వం టెస్కో టెండర్ విధానాన్ని వెంటనే పునఃపరిశీలించి చేనేత కార్మికులకు న్యాయమైన ధరలు కల్పించడంతో పాటు చేనేత సహకార సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతూ,చేనేత పరిశ్రమను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version