సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసీఆర్ విజన్‌కు సాక్ష్యం.

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసీఆర్ విజన్‌కు సాక్ష్యం: కేటీఆర్

పరిపాలన అంటే కేవలం శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదని.. అభివృద్ధి, ప్రగతి అంటే రాజకీయ హంగులు ఆర్భాటాలు ఏమాత్రం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావువ్యాఖ్యానించారు. నిజమైన నాయకుడు ఒక తరం లేదా ఒక ఎన్నిక గురించి మాత్రమే ఆలోచించరని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్: పరిపాలన అంటే కేవలం శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదని.. అభివృద్ధి, ప్రగతి అంటే రాజకీయ హంగులు ఆర్భాటాలు ఏమాత్రం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) వ్యాఖ్యానించారు. నిజమైన నాయకుడు ఒక తరం లేదా ఒక ఎన్నిక గురించి మాత్రమే ఆలోచించరని చెప్పుకొచ్చారు. తరతరాలపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనాలు కలిగించే ప్రణాళికలే నిజమైన నాయకుడి పనితనమని తెలిపారు కేటీఆర్.

ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాంటి నాయకుడు కేసీఆర్ దూరదృష్టి ఫలితంగా రెండు అద్భుత ఫలితాలను తెలంగాణ ఈరోజు సాధించిందని ఉద్ఘాటించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసీఆర్ విజన్‌కు మరో జీవన సాక్ష్యమని నొక్కిచెప్పారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మోటార్లు ఆన్ చేయడంతో.. ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరానికి, వ్యవసాయ భూమికి సాగునీరు అందుతోందని వెల్లడించారు. కేసీఆర్ హయాంలోని మరో అద్భుతం యాదాద్రి థర్మల్ ప్లాంట్. దామరచర్ల అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్‌లోని యూనిట్ వన్‌లో 72 గంటల కోడ్ (COD)ని విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పుకొచ్చారు. తమ నాయకుడు కేసీఆర్ పాలన, విజన్ మా అందరికీ గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్ ముందుచూపుతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం: హరీష్‌రావు

కేసీఆర్ ముందుచూపుతో గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించి సస్యశ్యామలంగా చేయాలన్న సంకల్పంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) తెలిపారు. ఎట్టకేలకు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేసి నీళ్లు అందించడంతో రైతులు కేసీఆర్ కృషిని గుర్తు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టు విలువ ఏమిటో ఇప్పుడు అనుభవంలోకి వచ్చిందని అన్నారు. నదీ జలాల సద్వినియోగానికి కేసీఆర్ చిత్తశుద్ధితో చేసిన కృషికి సీతారామ ప్రాజెక్టు ఓ సజీవ సాక్ష్యమని ఉద్గాటించారు. సీతారామ ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేసినట్లే, కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి సాగు నీటి కోసం ఎదురుచూస్తున్న రైతాంగాన్ని రేవంత్ ప్రభుత్వం ఆదుకోవాలని హరీష్‌రావు కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version