సింగరేణి కార్మికుల సొంత ఇంటి కోసం ఓటింగ్..

సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో ఓటింగ్ ద్వారా అభిప్రాయ సేకరణ

కంపేటి రాజయ్య, బంద్ సాయిలు

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణి కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గత రెండు రోజులపాటు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా కార్మికుల అభిప్రాయాల సేకరణ చేపట్టారు.
ఈ మేరకు శనివారం స్థానిక శ్రామిక భవనంలో విలేకర్ల సమక్షంలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పెట్టారు. ఈనెల 11, 12 తేదీలలో నిర్వహించిన ఓటింగ్ లో సొంతింటి కల నెరవేర్చాలని 3000 మంది కార్మికులు పాల్గొని వారీ అభిప్రాయాన్ని బ్యాలెట్ పత్రంపై తెలియజేశారు. 21 మంది సొంతిల్లు, క్వార్టర్ కావాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమిటీ రాజయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బంధు సాయిలు మాట్లాడుతూ… 40 వేల మంది సింగరేణి కార్మికుల యొక్క శ్రమ ఫలితంగా వేలకోట్ల రూపాయల లాభాల్లో సింగరేణి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్లు డివిడెంట్ రూపంలో సింగరేణి చెల్లిస్తూ ఉన్నదనీ, ఇంత శ్రమ చేస్తున్న సింగరేణి కార్మికులకు మాత్రం సొంత ఇల్లు లేకపోవడం బాధాకరమన్నారు. సింగరేణి వ్యాప్తంగా 18 వేల సింగరేణి క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయని, 3200 క్వార్టర్లు శిధిలావస్థకు చేరుకున్నయని తెలిపారు. వేలాదికరాల భూమి సింగరేణి ఆధీనంలో ఉందని కార్మికులకు సొంతింటి నిర్మాణానికి ఇంటి స్థలం కేటాయించి, రూ.25 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సొంత ఇంటి కల నెరవేర్చే వరకు కార్మిక సంఘాలు సంఘాల కతీతంగా పోరాటాలు నిర్వహించి కార్మికుల పక్షాన ఉండాలని విజ్ఞప్తి చేశారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు బాధ్యత తీసుకోవాలని, మిగతా కార్మిక సంఘాలను ఏకం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గుర్రం దేవేందర్, దీకొండ ప్రసాద్, ఎం రాజేందర్, తోట రమేష్, బిక్షపతి, రవి కుమార్, రాజాకు, శంకరు తదితరులు పాల్గొన్నారు.

అక్షరాభ్యాసం తోనే అభివృద్ధి సాధ్యం

అక్షరాభ్యాసం తోనే అభివృద్ధి సాధ్యం

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా విద్యాశాఖ అధికారి యం రాజేందర్ డిఆర్డిఏ పిడి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించనైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి వయోజనులను అక్షరాస్యత క్రమము పెంచే దిశగా ఈ కార్యక్రమము కొనసాగుతుందని ప్రతి గ్రామము మండలంలో వయోజనులలో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చి దిద్దడానికి అందరూ కృషి చేయాలని కోరారు. చదువుకోవాలని కోరిక గల వారికి ఉజ్వల భవిష్యత్తును తెలంగాణ ఓపెన్ స్కూల్ విద్యావకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. ముఖ్యంగా బాలికలు, మహిళలు, గ్రామీణ యువత, పనిచేసే స్త్రీ, పురుషులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇతరులకు విద్యను అందించడమే తెలంగాణ ఓపెన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం అని, అందరికీ విద్యను అందించే ఉద్దేశంతో తెలంగాణ ఓపెన్ స్కూల్ 2008-09 విద్యా సంవత్సరం నుండి పదవ తరగతి కోర్సును అందిస్తుందన్నారు. 2010-11 నుండి తెలంగాణ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ను కోర్సును ప్రారంభించిందని తెలియజేశారు.కమ్యూనిటీ మొబైలైజ్డ్ అధికారి సామల రమేష్ మాట్లాడుతూ అక్షరాస్యత తోనే అభివృద్ధిని సాధించగలమని అందుకు అనుగుణంగా మండల పరిధిలోని మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ పరిధిలోని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు అందరము ఉమ్మడిగా పనిచేసి తమ తమ పరిధిలోగల వయోజనులందరిని అక్షరాస్యతులుగా చేసినట్లయితే దేశ పురోభివృద్ధిలో వారి పాత్ర గణనీయంగా ఉంటుందని, దానివల్ల దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగవుతాయని మీ అందరూ వీటికి అనుగుణంగా పనిచేసి మన జిల్లాను ముందు వరసలో నిలపాలని వారు ప్రత్యేకంగా కోరినారు. పూర్వపు వరంగల్ జిల్లా సార్వత్రిక విద్యాపీఠం కోఆర్డినేటర్ సదానందం మాట్లాడుతూ వయోజనులలో గుర్తించిన నిరక్షరాస్యులను పదో తరగతి ఇంటర్మీడియట్ లలో ప్రవేశము పొందడానికి వారిని గుర్తించి సంబంధిత మండలంలోని పాఠశాలలో కోఆర్డినేటర్ కు సార్వత్రిక విద్యాపీఠము పదవ తరగతి, ఇంటర్మీడియట్లలో చేర్పించవలసిందిగా వారు కోరినారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య విభాగ కోఆర్డినేటర్ వేణుగోపాల్ జిల్లాలోని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సి ఆర్ పి లు డిఆర్డిఏ ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version