నర్సంపేటలో తూనికలు–కొలతల చట్టం ఉల్లంఘన
10 షాపులపై కేసులు నమోదు
నర్సంపేట పట్టణంలో ఆకస్మిక తనిఖీలు
నెలకోసారి తనిఖీలు చేస్తే కొనుగోలుదారులకు మేలు..
నర్సంపేట, నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలో తూనికలు–కొలతల చట్టం ఉల్లంఘన చేపట్టడంతో సంబంధిత అధికారులు ఫైర్ అయ్యారు.తూనికలు–కొలతలల్లో అవకతవకలకు పాల్పడుతున్న వివిధ రకాల 10 దుకాణాలపై కేసులు నమోదు చేశారు.
తూనికలు–కొలతల చట్టం అమలుపై జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి వరంగల్ మనోహర్ ఆధ్వర్యంలో ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్యాస్ డెలివరీ ఆటోల్లో బరువు, పెట్రోల్ పంపులు, బంగారు దుకాణాలు, కిరాణా షాపులు, చికెన్, మటన్ మరియు చేపల దుకాణాలను పరిశీలించి తూనికలు, కొలతలు సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో తనిఖీ చేశారు.
తనిఖీలలో తూనికలు–కొలతల చట్టం నిబంధనలు ఉల్లంఘించిన కిరాణా, చికెన్, మటన్, చేపల దుకాణాలపై మొత్తం 10 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్ మాట్లాడుతూ వ్యాపారులు తూనికలు–కొలతల చట్టం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వినియోగదారులకు న్యాయం జరిగేలా సరైన కొలతలతో వస్తువులు విక్రయించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నెలకోసారి తనిఖీలు చేస్తే కొనుగోలుదారులకు మేలు..
నర్సంపేట పట్టణంలోనే కాకుండా డివిజన్ వ్యాప్తంగా తూనికలు–కొలతల శాఖ ఆధ్వర్యంలో ప్రతినెల తనిఖీలు చేపడితే కొనుగోలుదారులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని ప్రజల కోరుతున్నారు. ఏడాదికోసారి మంత్రంగా తనిఖీలు నిర్వహించి అరకొర గా కేసులు నమోదు చేయడం సంబంధిత అధికారులు చేతులు దులుపుకున్నట్లే అని ప్రజల విమర్శిస్తున్నారు.
