మేడారం జాతరలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ 71 కేజీల బంగారం సమర్పణ

మేడారం సమ్మక్క – సారలమ్మకు బంగారాన్ని సమర్పించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ కుంభమేళాగా పిలవబడే ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని శ్రీ సమ్మక్క – సారలమ్మ మహా జాతరలో భాగంగా శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు- పద్మ(గణపురం మాజీ జడ్పీటీసీ) దంపతులు వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తన బరువుకు సమానంగా 71 కేజీల బంగారం(బెల్లం)ను వనదేవతలకు నైవేద్యంగా సమర్పించారు.గిరిజన సంప్రదాయం ప్రకారం బెల్లాన్ని బంగారంలా భావించి సమర్పించడం మేడారం జాతరలో ముఖ్యమైన ఆచారమని,శ్రీ సమ్మక్క – సారలమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు.
గట్టమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు.

మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ తల్లుల దర్శనం కన్నా ముందు ఎమ్మెల్యే దంపతులు ములుగు పట్టణానికి సమీపంలోని గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులకు అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు. మేడారం గిరిజన జాతరకు వెళ్లే భక్తులకు గట్టమ్మ ఆలయం గేట్ వే ఆఫ్ మేడారం గా ప్రసిద్ధి చెందింది.
కమలాపూర్ శ్రీ సమ్మక్క – సారలమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు.
భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామ శివారులో జరుగుతున్న శ్రీ సమ్మక్క – సారలమ్మ మినీ మేడారం జాతరలో ఎమ్మెల్యే దంపతులిద్దరూ పాల్గొని, వన దేవతలను దర్శించుకుని మొక్కులను చెల్లించారు. కాగా, జాతర కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే దంపతులకు శాలువాలు కప్పి డప్పు చప్పుళ్ళతో స్వాగతం పలికారు. కమలాపూర్ శ్రీ సమ్మక్క – సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version