పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి…

పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద

*అవగాహన ప్రచార రథాన్ని ప్రారభించిన కలెక్టర్

నర్సంపేట/గీసుగొండ,నేటిధాత్రి:

రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
గీసుకొండ మండలం దసరుతండా గ్రామపంచాయతీ పరిధిలోని దసరుతండా, మంగళతండా గ్రామాలలో ప్రజా పాలన–ప్రగతి 99 రోజుల ప్రణాళికలో భాగంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అమృత అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాడి రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి వలన కలిగే నష్టాలు, పాడి పశువుల ప్రాధాన్యత మరియు వాటి ద్వారా మానవాళికి కలిగే లాభాలను వివరించారు.
జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ ఎం. బాలకృష్ణ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి లక్షణాలు మరియు నివారణపై సంక్షిప్తంగా వివరించి, ముందస్తు టీకాలే ఉత్తమ రక్షణ అని రైతులకు సూచించారు.ఈ సందర్భంగా గాలికుంటు వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ రథం జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పించనుంది.ఈ శిబిరంలో పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడంతో పాటు, లేగదూడలు మరియు పెద్ద పశువులకు పురుగుమందులు అందించారు. అదేవిధంగా రైతులకు 75 శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేశారు.గాలికుంటు వ్యాధి పశువుల పాల ఉత్పత్తిని గణనీయంగా తగ్గించి, రైతులకు ఆర్థిక నష్టం కలిగించే ముఖ్యమైన వ్యాధి. ఈ వ్యాధి వైరస్ ద్వారా వ్యాపించి, ముఖ్యంగా సంకరజాతి పశువుల్లో ఎక్కువగా కనిపిస్తుందని. మార్చి, ఏప్రిల్, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో ఈ వ్యాధి అధికంగా ప్రబలుతుంది.

వ్యాధి నివారణ కోసం పశువులకు ముందుగానే టీకాలు వేయించడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక ఉచిత టీకాల కార్యక్రమాన్ని మార్చి 10 నుండి ఏప్రిల్ 9, 2026 వరకు నిర్వహిస్తున్నారు. 2030 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని గాలికుంటు వ్యాధి రహిత ప్రాంతంగా ప్రకటించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ కార్యక్రమంలో మొత్తం 115 పశువులకు టీకాలు అందించామని స్థానిక పశువైద్య అధికారి డాక్టర్ గైని శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గీసుకొండ పశువైద్య అధికారి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, కొమ్మాల పశువైద్య అధికారి డాక్టర్ గైని శ్రీనివాస్, డాక్టర్ రాధిక, సిబ్బంది చిరంజీవి, సుమన్, చందు, జితేందర్, గోపాల మిత్రులు ఇస్మాయిల్, రమేష్, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version