*ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య *
జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన గుణాత్మక విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పిడిసిల్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మహ్మద్ సాదిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి సబ్జెక్టులో తగిన అర్హతలతో మంచి అనుభవం గల ఉపాధ్యాయులచే అన్ని ప్రభుత్వ పాఠశాలలో బోధన అందిస్తున్నామన్నారు. ఐఎఫ్ఫీ (IFP)ప్యానల్ బోర్డుతో విద్యార్థులకు పరిపూర్ణమైన అవగాహనను కల్పిస్తూ, ప్రతి అంశాన్ని కళ్ళకు కట్టినట్టు విద్య బోధన జరుగుతుందన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో ఏఐ (కృత్రిమ మేధ) తో కూడా విద్య బోధన అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టిక ఆహారం, ఉదయం రాగి జావా, ఉచిత పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, 10వ తరగతి విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతుల బోధన, ఆ సమయంలో విద్యార్థులకు స్నాక్స్ కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు విశాలమైన ఆట స్థలంలో వారి ఆసక్తికి అనుగుణంగా వ్యాయామ ఉపాధ్యాయులచే వివిధ రకాల ఆటలు ఆడిస్తూ వారి మానసిక, శారీరక పెరుగుదలకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సాదిక్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బడి ఈడు పిల్లలను, ప్రవేట్ పాఠశాలకు వెళ్తున్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిడిసిల్ల ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ చేపించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సామల రమేష్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శోభ, అంగన్వాడి సిబ్బంది, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు…