Paddy Procurement Centers Launched in Ganapuram
గణపురం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్ఆర్
గణపురం నేటి ధాత్రి
గణపురంమండలంలోని జంగుపల్లి, బస్వరాజుపల్లి, ధర్మారావుపేట, నగరంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే విక్రయించుకోవాలని సూచించారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు దళారుల బెడద ఉండదని, పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు. రైతులకు తక్షణ చెల్లింపులు, రవాణా సౌకర్యం వంటి ప్రయోజనాలు అందుతాయని వివరించారు.
భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి కోతలు లేకుండా సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
