ఐక్యంగా పని చేశాం..
అద్భుత విజయం సాధించాం..
కార్యకర్తలంతా కేసీఆర్ వెంటే ఉన్నరు..
ప్రజల కోసం నికరంగా ఐదేళ్లు కొట్లాడెటోల్లు కావాలె
ప్రగతి భవన్ ముందు కంచె వేసింది, తీసింది కాంగ్రెస్సే..
నర్మెటలో వినాయక గార్డెన్ లో కృతజ్ఞత సమావేశం
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉందని, బీఆర్ఎస్ గెలవాలి..కేసీఆర్ మళ్లీ సీఎం కావాలనే దృఢ సంకల్పంతో కార్యకర్తలంతా ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా ఐక్యంగా పనిచేశారు కాబట్టే మనం అద్బుతమైన విజయం సాధించామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం నర్మెట మండల కేంద్రంలోని వినాయక గార్డెన్ లో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సమావేశానికి పార్టీ మండలా ధ్యక్షుడు చింతకింది సురేష్ అధ్యక్షత వహంచగా, పల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని మొదటిసారి మండలానికి విచ్చేయగా, ప్రజాప్రతినిధులు, నాయకులు పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధి 17 గ్రామాల్లో 14 గ్రామాల్లో సంపూర్ణ మెజారిటీ ఇచ్చా రన్నారు. నర్మెట మండల ప్రజలంతా బీఆర్ఎస్ వెంట, కేసీఆర్ తోనే ఉండాలనుకుని చాలా కృషి చేశారని, అందుకే మంచి మెజారిటీ వచ్చిందని, అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. ఈ నెల 9న ప్రమాణ స్వీకారం రోజునే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రమాణం చేశారని, కానీ, నేటికీ ఇవ్వలేదని ఆరోపించారు. రైతులంతా ధాన్యం అమ్మొద్దని, రూ.500 బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీని మర్చా రన్నారు. అలాగే మహాలక్ష్మి పథకంలో ఒక్క బస్ పథకం ఇచ్చి మిగితావి ఇవ్వకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇక సీఎం ఆఫీస్ ముందు ముళ్ల కంచె వేసింది కేసీఆర్ కాదని, ఆ రోజు వేసింది వాళ్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి..ఈరోజు తీసింది వారేనని గుర్తు చేశారు. పదేళ్ల కాలంలో విద్యుత్ విషయంతో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తెచ్చిన అప్పుల గురించి చెబుతున్న సీఎం ఇచ్చిన ఆస్తుల గురించి మాత్రం చెప్పకపోవడం సరి కాదన్నారు. గతంలో19 లక్షల బోర్ల ఉంటే ఇప్పుడు 23 లక్షల బోర్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. సివిల్ కార్పొరేషన్ కు సంబంధించి రూ.56 వేల కోట్లు అప్పులు చేసామని చెబుతున్నారే తప్ప, రూ.45 వేల కోట్లు రావాలని చెప్పకుండా అబద్దాలు మాట్లాడుతు న్నారన్నారు..ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వొద్దంటున్నారని, అయితే గతంలో సీతక్క, శ్రీధర్ బాబు ద్వారా ఇప్పించా ము కదా అని గుర్తు చేశారు. ఐదేళ్లు నేను జీతం నేను తీసుకోనని, కార్యకర్తకు ఇస్తాననన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రుల దగ్గరికి వెళ్లి మాట్లాడే శక్తి నాకు ఉందని, చట్టపరంగా ఎలా నిధులు తీసుకోవాలో అలానే తీసుకొస్తానన్నారు. ఇక కేసీఆర్ పేరుతో ఉన్న శిలా ఫలకాలను మట్టితో చేర్పుతున్నారని, బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులు చెప్పకుండా కేసీఆర్ పై ఆసభ్యకరంగా మాట్లాడుతున్నారని వాపోయారు. అద్భుతమైన అమరువీరుల స్తూపం, ప్రగతి భవన్ మేమే కట్టించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ లో ఇటీవల ఢిల్లీ గులాంలకు విందు ఏర్పాటు చేశారని, అమరవీరుల కుటుంబాలకు విందు పెట్టారా అని ప్రశ్నించారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నా దగ్గరికి రావొచ్చు..డైరెక్ట్ గా వచ్చిన సమస్య చెప్పుకోవచ్చన్నారు. వచ్చే ఆరు నెలల్లో ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వస్తున్నాయని, మెజారిటీ సీట్లు మనం గెలిచే అవకాశం ఉందన్నారు. అయితే ఐదేళ్లు నికరంగా కొట్లాడే వాళ్లు మనకు కావాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు గొడవలు చేసే ప్రయత్నం చేస్తారని, వారి దాడులను ఎదుర్కొనే నాయకులు, కార్యకర్తలు కావాలన్నారు.