జడ్చర్ల /నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, మండలాలు 44వ జాతీయ రహదారిపై ఉండడంతో.. నూతన భవనాల నిర్మాణం భాగ్యనగరం మించి నిర్మాణాలను చేపడుతున్నారు. నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సజావుగా సాగడంతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభాలు పొంది తమ జీవితంలో నూతన వరవడిని సృష్టించారు. దీంతో ఆయా మండల కేంద్రాలలో పెద్దపెద్ద భవనాల నిర్మాణాలు చేపట్టారు. పెద్దపెద్ద భవంతులను ప్రైవేటు వ్యాపారాలకు అద్దెకు ఇస్తున్నారు. డబ్బు సంపాదించిన పలువురు సొంతంగా భూములను, ప్లాట్లను కొన్నారు. మరికొందరు వ్యాపారస్తులు వివిధ రకాల వ్యాపారాలు మొదలుపెట్టారు. మరికొందరు లగ్జరీ కార్ లను కలిగి ఉన్నారు. తమ పిల్లలను కార్పొరేటు పాఠశాల, కళాశాలలో చదివిస్తూ విదేశాలకు పంపుతున్నారు. తమ కుటుంబాలలో ఏ చిన్న ఫంక్షన్ చేయాలన్న ఫంక్షన్ హాల్ లో చేస్తూ.. గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మార్వాడీ వ్యాపారస్తుల లాగా.. తాము డబ్బున్న వారిగా ఉనికిని చాటుకుంటున్నారు. ఒకప్పుడు సాధారణ గుడిసెలు, పెంకుటిల్లలో జీవితం గడిపిన వారు.. ప్రస్తుతం బ్యూటీ భవనాలలో నివసిస్తుండడంతో జీవనశైలి మారిందని పలువురు ప్రజలు చర్చించుకుంటున్నారు.