*నీట్-యూజీ 2026 స్కాం బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం*
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కేంద్ర ప్రభుత్వం
కొల్లూర్ మాజీ సర్పంచ్ సావిత్రి బస్వారాజ్ పాటిల్
*జహీరాబాద్ నేటిధాత్రి:*
నీట్-యూజీ 2026 పరీక్షలో వెలుగులోకి వస్తున్న పేపర్ లీక్, అవినీతి ఆరోపణలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్నాయని ఝరాసంగం మండల కొల్లూర్ గ్రామ మాజీ సర్పంచ్ సావిత్రి బస్వారాజ్ పాటిల్ తీవ్రంగా విమర్శించారు. “ఒక దేశం–ఒక పరీక్ష” అంటూ గొప్పలు చెప్పుకున్న బీజేపీ ప్రభుత్వం, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును రక్షించడంలో పూర్తిగా విఫలమైందని ఆమె అన్నారు.నీట్ పరీక్షల సమయంలో విద్యార్థులపై అత్యంత కఠిన నిబంధనలు అమలు చేస్తూ, చెవిపోగులు నుంచి జుట్టు క్లిప్పుల వరకు తనిఖీలు చేసే అధికారులు, అసలు ప్రశ్నపత్రాలనే కాపాడలేకపోవడం సిగ్గుచేటని సుగుణక్క మండిపడ్డారు. విద్యార్థులపై మాత్రమే అనుమానం చూపించే ఈ ప్రభుత్వం, వ్యవస్థలో ఉన్న అవినీతిపరులపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోందని ప్రశ్నించారు.ప్రతి సంవత్సరం నీట్ చుట్టూ పేపర్ లీకులు, మార్కుల గందరగోళం, గ్రేస్ మార్కుల వివాదాలు వస్తూనే ఉండటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అయినా బీజేపీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదని, తప్పు చేసిన అధికారులను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.గతంలో రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలు ఉండేవని, కానీ బీజేపీ ప్రభుత్వం బలవంతంగా తీసుకొచ్చిన నీట్ విధానం వల్ల కోచింగ్ మాఫియాలు మాత్రమే లాభపడుతున్నాయని విమర్శించారు. గ్రామీణ, పేద, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు.
పరీక్షలు రద్దు చేయడం, మళ్లీ నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను హక్కుగా కాకుండా వ్యాపారంగా మార్చిన బీజేపీ విధానాల ఫలితమే ఈ పరిస్థితి అని అన్నారు.నీట్-యూజీ 2026 స్కాంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ సర్పంచ్ సావిత్రి బస్వారాజ్ పాటిల్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిని ఎంతటి స్థాయిలో ఉన్నా కఠినంగా శిక్షించాలని వారు అన్నారు,
