Cooking Gas Shortage Troubles Sircilla Residents
వంట గ్యాస్ కరువు,సిరిసిల్ల ప్రజలకు బరువు
ప్రజలకు అందని గ్యాస్ సరఫరా
గ్యాస్ కరువుతో కొన్ని చోట్ల పలు వ్యాపార సంస్థలు, హోటల్లు నిలిపివేత
వెయ్యిల్లో బ్లాక్ దందాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు
ఏజెన్సీలకు సరఫరా గ్యాస్ కంపెనీలు ఆలస్యం
సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)
సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో వంట గ్యాస్ కొరత తీవ్రంగా నెలకొంది. పట్టణ కేంద్రంలోని పలు గ్యాస్ ఏజెన్సీలు సరఫరాను సక్రమంగా అందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్యాస్ సిలిండర్లు గోదాముల్లో ఉన్నప్పటికీ సామాన్య ప్రజలకు అందకుండా సరఫరా నిలిపివేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు వంట గ్యాస్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నెలలో సిలిండర్ 925 /-రూపాయలు ఉండేది నేడు సుమారు 985/- గా ఉంటూ 60 రూపాయలు అదనపు గా ఈ నెలలో పెరిగిందని ఆరోపిస్తున్నారు. సమయంలో కొందరు ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్లను ఇతర వ్యాపార సంస్థలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు బ్లాక్లో వెయ్యి రూపాయలకు పైగా విక్రయించబడుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే బ్లాక్ మార్కెట్ దందాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పలు రకాల ఏజెన్సీ అడగగా.. పై నుండి వచ్చే గ్యాస్ సరఫరా నాలుగు రోజులకు ఒకసారి లోడింగ్ వస్తుందని అంతే కాకుండా, ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా ఒకేసారి వంట గ్యాస్ బుకింగ్ చేసుకుంటూ ఎక్కువగా నిలువ ఉంచుకోవడం ద్వారా నిజంగా వంట గ్యాస్ లేని అటువంటి వారికి ఇబ్బంది కొరత ఏర్పడుతుందని తెలిపారు.
