Diesel Shortage Hits Farming
డీజిల్ కొరతతో వ్యవసాయం దెబ్బతింటోంది వరికెల
నడికూడ,నేటిధాత్రి:
జిల్లాలో ప్రస్తుతం డీజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో వ్యవసాయ పనులు పూర్తిగా స్థంభించిపోయే పరిస్థితి నెలకొంది.ముఖ్యంగా సాగు కాలంలో ట్రాక్టర్లు,ఇతర వ్యవసాయ యంత్రాలకు అవసరమైన డీజిల్ అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీనితో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలని కోరారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి రైతులకు అవసరమైనంత డీజిల్ను సరఫరా చేయాలని పౌర సరఫరా శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
రైతులు ఇప్పటికే కష్టాల్లో ఉన్నారని,ఈ డీజిల్ కొరత పరిస్థితి మరింత సమస్యలను తెచ్చిపెడుతోందని ఆయన అన్నారు.ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని,ప్రతి మండలంలో డీజిల్ అందుబాటును పెంచి, రైతులకు ఎటువంటి అంతరాయం లేకుండా వ్యవసాయ పనులు సాగేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం గంభీరంగా పరిగణించి,తక్షణ పరిష్కారం చూపాలని తెలంగాణ రైతు రక్షణ సమితి తరఫున ప్రభుత్వాన్ని కోరారు.
