ఉత్తరాదిలో విస్తరణకు కాంగ్రెస్‌కు అడ్డంకులు

`వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు భిన్నం

`కేంద్ర నాయకత్వం బలహీనం

`రాష్ట్రాల్లో సమస్యలను పరిష్కరించలేకపోవడం

`రాజకీయాలు కెరీర్‌గా మారడం

`నిబద్దత కలిగిన నాయకులు కరవు

`క్యాన్సర్‌లా మారిన గ్రూపు తగాదాలు

`వెంటిలేటర్‌పై కాంగ్రెస్‌కు చికిత్స ఫలించేనా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పార్టీల తలరాతలు మార్చే ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో నెలకొన్న వివిధ భౌగోళిక రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌ ఎదుగుదలకు అడ్డంకులుగా వున్నాయి. కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్టు పార్టీని అంపశయ్యమీదనే కొనసాగేలా చేస్తున్నాయి. ఉదాహరణకు హర్యానా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పరిస్థితిని ఈ క్రింది విధంగా విశ్లేషించవచ్చు.

హర్యానాలో కాంగ్రెస్‌ పార్టీలో భూపేంద్రసింగ్‌ హుడా, కుమారి షెల్జా మధ్య తీవ్రస్థాయిలో వర్గ పోరు కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అ సెంబ్లీలో ప్రతిపక్షనేతను నియమించలేని దుస్థితి నెలకొంది. అధిష్టానం కూడా వీరిద్దరినీ ని యంత్రించలేక మీ తిప్పలు మీరు పడండన్న రీతిలో వ్యవహరిస్తోంది. వీరిద్దరి మధ్య నెలకొన్న వైరమే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలవడానికి ప్రధాన కారణమని పార్టీవర్గాలే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి. గత పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ పట్ల సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో, దీన్ని సానుకూలంగా మార్చుకోవడానికి బదులు వీరిద్దరు నాయకులు తమ ప్రాబల్యం నిలుపుకోవడం కోసం నిరంతర పోరు కొనసాగిస్తూ పార్టీ లో బిభేదాలను రావణకాష్టంగా మలుస్తున్నారు. దీని ఫలితంగానే రాష్ట్రంలో పునర్నిర్మాణ ప్రక్రియ కూడా అడుగు ముందుకు పడటంలేదు. రాష్ట్రంలో జిల్లాస్థాయి పార్టీ అధ్యక్షుల నియామకం చేపట్టిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగడం విధాయకం. 45 రోజుల కాలంగా వివిధ జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల నియామకంకోసం జరుగుతున్న ప్రయత్నాల్లో రెండు గ్రూపుల వారు ఆధితప త్యంకోసం అంటే ఎక్కుమంది జిల్లా అధ్యక్షులు తమ గ్రూపువారే వుండాలన్న ఉద్దేశంతో తీవ్రంగా పోటీపడుతున్న నేపథ్యంలో ఈ నియామకాలు ఒక కొలిక్కి రావడంలేదు. ఎవరికివారు అత్య ధికులు తమ వర్గవారిని జిల్లా అధ్యక్షులుగా నియమించేలా చూసుకుంటే, రాష్ట్ర అధ్యక్ష పదవిని తామే కైవసం చేసుకోచ్చన్నది హుడా, శైలజల వ్యూహంగా కనిపిస్తోంది. ఫలితంగా ఈ ఎన్నిక లూ ఒక కొలిక్కి రావడంలేదు. కాంగ్రెస్‌ అంటేనే సమస్యల కొలిమి. ఈ కొలిమిలో చలికాచుకునేది కొందరైతే, చేతులు కాల్చుకునేవారు మరికొందరు. ఇప్పటికే బలీయమైన నాయకత్వం పార్టీని వీడిపోయినప్పటికీ, ఉన్న నాయకత్వం తమ పైతరాల నాయకుల రాజకీయశైలినే అనుసరిస్తూ పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ రెండు ప్రధాన గ్రూపులుగా చీలిపోవ డంతో, పునర్నిర్మాణ ప్రక్రియ ఒక ప్రహసనంగా మారింది. దీంతో ఉన్న నాయకుల్లో కాస్త నిజాయతీగా సమర్థవంతంగా పనిచేసేవారు ఎవరికివారు పక్కకు తప్పుకోవడం పార్టీకి ఆత్మహత్యా సదృశంగా మారింది. కేంద్రంలో బలీయమైన నాయకత్వం లేకపోవడం కూడా ఈ మితిమీరిన స్వే చ్ఛకు, ధిక్కారస్వరానికి ప్రధాన కారణం. కేంద్రనాయకత్వం బలంగా వుంటే రాష్ట్రంలో గ్రూపు రాజకీయాలు ఈ స్థాయికి దిగజారబోవు. అంతేకాదు ఇటువంటి ఫ్యాక్షన్‌ రాజకీయాలు పార్టీకి కొత్తేమీ కానప్పటికీ రావణకాష్టంలా కొనసాగుతుండటం పార్టీ పుట్టిముంచుతోంది. 

మధ్యప్రదేశ్‌

పార్టీలో బీజేపీ ఏజెంట్లు వున్నారంటూ సాక్షాత్తు రాహుల్‌ గాంధీ ప్రకటించడాన్ని బట్టి చూస్తే మధ్యప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి ఎట్లావున్నదీ అర్థమవుతుంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల కాంగ్రెస్‌ అధ్య క్షులు బీజేపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటూ పార్టీలో చాలామంది నాయకులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్న విషయం. కాంగ్రెస్‌ తరపున మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన భైరోసింగ్‌ తనకు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ుతో ప్రత్యక్ష సంబంధాలున్నాయని చెప్పుకోవడానికి ఎంతమా త్రం సంకోచించలేదు. భాజపాకు అనుకూలంగా పనిచేసే ఇటువంటి జిల్లా నాయకత్వం వల్ల నిజమైన కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ వాణిని వినిపించలేకపోతున్నారనేది అభిప్రాయం. ఇటువంటి నాయకత్వం పనితీరు భాజపా విజయానికి దోహదం చేసేదిగా వుంటోంది తప్ప, పార్టీకి మేలు చేయడంలేదని వీరి ప్రధాన ఆరోపణ. వీటికితోడు పార్టీలు మారే సంస్కృతి విపరీతంగా పెరిగిపోవడం కూడా కార్యకర్తల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. ఇప్పుడు రాజకీయాలు సైద్ధాంతికం కంటే కెరీర్‌గా మారిన నేపథ్యంలో అసలు రాజకీయ సంస్కృతే పూర్తిగా మారిపోయింది. పార్టీలతో ప్రమేయం లేకుండా సీటుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడని దశకు రాజకీయాలు చేరుకోవడంవర్తమాన పరిణామం! ఇది మధ్యప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాదు! ఫలితంగా గెలుపు అవకాశాలకంటే, టిక్కెట్‌ ఇచ్చే పార్టీకే నాయకులు ప్రాధాన్యత ఇస్తుండటంతో సిద్ధాంతాలు గాల్లో కలిసిపోయి ఏనాడో అయింది. పార్టీలో ఒక స్థాయిలో వున్న నాయకుడు మరో పార్టీకి ఏజెంట్‌గా మారి పనిచేసే దశకు మధ్యప్రదేశ్‌ రాజకీయాలు పరిణామం చెందాయి. అంటే వుండేది ఒక పార్టీలో పనిచేసేది మరో పార్టీకోసం! వలువలు లేని నైతిక విలువలకు ఇంతకు మించిన గొప్ప ఉదాహరణ అవసరంలేదు. ఇవన్నీ జరిగేది కేవలం ‘కెరీర్‌’లో అభివృద్ధి కోసం తప్ప మరోటి కాదు. ఇది దిగువస్థాయి కార్యకర్తల వరకు ఇంకా చేరుకోకపోవడంతో, పై స్థాయిలో జరిగే రాజకీయ పరిణామాలు వీరికి హృదయశల్యను కలుగజేయడం వర్తమాన పరిణామం. ఈ సంస్కృతి క్షే త్రస్థాయికి పాకితే ఇక పార్టీలు కేవలం ‘ఆశ్రయం’ కల్పించడానికి తప్ప మరెందుకూ పనికిరావు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో చేపట్టిన జిల్లా స్థాయి నాయకత్వాల మార్పుల ప్రక్రియలో బీజేపీ అనుకూల నాయకత్వాన్ని మార్చకపోవడం పార్టీ కేడర్‌ను నిరుత్సాహ పరుస్తోంది. రాబోయే కాలంలో ఇటువంటి నాయకులవల్ల పార్టీకి చెరుపే తప్ప మేలు వుండదనేది కార్యకర్తల ఆవేదన! కాంగ్రెస్‌ మహాసముద్ర ‘హోరు’లో ఇటువంటి ‘వాణు’లు వినే నాధుడే వుండడు! అంపశయ్యపై వున్నా, కాంగ్రెస్‌ను పీడిస్తున్న ఈ విషసంస్కృతి పార్టీని మరింతగా దెబ్బతీస్తోంది. 

ఉత్తరప్రదేశ్‌

ఉత్తరప్రదేశ్‌లో జిల్లాస్థాయి నాయకత్వాన్ని నియమించడంలో బీజేపీకంటే కాంగ్రెస్‌ ఎంతో ముందుంది. ఇటీవల విజయవంతంగా ఈ ప్రక్రియ పూర్తిచేయడం దిగుస్థాయి కేడర్‌లో ఆనందోత్సాహాలు నింపుతున్న మాట వాస్తవం. ముఖ్యంగా 2027 అసెంబ్లీ ఎన్నికల నాటికి సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్‌ కూటమి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నియామక ప్రక్రియ పూర్తికావడం గమ నార్హం. అయితే బూత్‌, మండల, బ్లాక్‌ స్థాయిల్లో ఇంకా పార్టీ నాయకులను ఎన్నిక ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఇదిలావుండగా పార్టీ ప్రక్షాళన నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీతో సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలనేది పార్టీ కేడర్‌ ప్రధానంగా కోరుతున్న అంశం. ఈ పొత్తువల్ల వున్న ఓటుబ్యాంక్‌ను నష్టపోవడమే కాదు, సమాజ్‌వాదీ పార్టీ తాము కోరుకున్న, తగినన్ని సీట్లు కేటాయించకపోవడం పార్టీ అభివృద్ధికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నదని వారు గట్టిగా విశ్వసిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా యు.పి. పార్టీ అధ్యక్షుడు అజయ్‌ రాయ్‌, కాంగ్రెస్‌ సొంతంగా పోటీచేయాలని గట్టిగా కోరారు. కానీ అధిష్టానం ఆయన సలహాను పట్టించుకోలేదు. అయితే ఎస్‌.పి.తో జట్టుకట్టడం వల్ల పార్టీ ఆరు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించగలిగింది. 2014 నుంచి ఇది పార్టీకి మంచి స్కోరుగానే చెప్పాలి. ఇక 2024 ఉపఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా, తానే అన్ని స్థానాలకు పోటీచేసింది. ఈ ఎన్నికల్లో తాను మునగడమే కాదు, కాంగ్రెస్‌కు అవకాశం లేకుండా చేసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌లో ప్రక్షాళన కార్యక్రమం చేపట్టాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పార్టీకి ఒక రూపు ఏర్పడుతున్న సమయంలో, కాంగ్రెస్‌ అధినాయకత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించవచ్చు. కానీ ఎస్‌.పి. ఎంతవరకు దీన్ని పడనిస్తుందనేది ప్ర స్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఎస్‌.పి. సైంధవ పాత్ర పోషిస్తే, కాంగ్రెస్‌ పరిస్థితి మ రింత దయనీయంగా మారగలదు. ఎందుకంటే ఇప్పుడు చేపట్టిన ప్రక్షాళన ప్రక్రియ వ్యర్థం కావడమే ఇందుకు కారణం. సంఘటన్‌ శ్రీజన్‌ అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) పేరుతో పార్టీ ప్రక్షాళన ప్రక్రియను వివిధ రాష్ట్రాల్లో చేపట్టినప్పటికీ, ఆయా రాష్ట్రాల భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఇది ముందుకు పోవడంలేదు. గుజారాత్‌లో బీజేపీ బలీయంగా వేళ్లూనుకొనిపోవడం, మధ్య ప్రదేశ్‌లో పార్టీలకి చొరబాట్లు, హర్యానాలో గ్రూపు తగాదాలు, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఆధిపత్యం వెరసి కాంగ్రెస్‌ అభివృద్ధిని పూర్తిగా నిరోధిస్తున్నాయనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!