పూరి మూవీలో సంయుక్త

పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న సినిమాలో విజయ్ సేతుపతి, టబు, దునియా విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ సినిమాలోకి తాజాగా సంయుక్త వచ్చి చేరింది.
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఛార్మి (Charmy) నిర్మాణ భాగస్వామిగా ఉంటున్న ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులే అయ్యింది. ఇందులో ఓ ప్రధాన పాత్రకు టబును తీసుకున్నట్టు చిత్ర బృందం గతంలోనే ప్రకటించింది. ఇప్పుడీ సినిమాలో మరో కీలక పాత్ర కోసం సంయుక్త మీనన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది.
పూరి, విజయ్ సేతుపతి కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీకి ‘బెగ్గర్’ అనే పేరు ఖరారు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ‘బెగ్గర్’ అనే పేరును కోలీవుడ్ వర్గాలు అంగీకరించవు కాబట్టి దాని బదులు ‘బిక్షాందేహి’ అనే టైటిల్ పెడితే మరింత బెటర్ గా ఉంటుందనే సలహా వచ్చిందట. చిత్రం ఏమంటే… తమిళులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ టైటిల్ ను అయినా యాక్సెప్ట్ చేస్తారు కానీ సంస్కృత పదాన్ని తమ సినిమాకు పేరుగా ఎందుకు ఒప్పుకుంటారు? అని కొందరంటున్నారు. ఏతావాతా ఈ సినిమా టైటిల్ పై ఇంకా అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది.
ఇదిలా ఉంటే… సంయుక్త మీనన్ తెలుగులో బాలకృష్ణ సరసన ‘అఖండ -2’ లో నటిస్తోంది. అలానే తన ప్రెజెంటర్ గా, దర్శకుడు యోగి తెరకెక్కిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీలోనూ ఆమె నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’లోనూ సంయుక్త నాయికగా చేస్తోంది. ఇక పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో తీయబోతున్న సినిమాలో ‘దునియా’ విజయ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే పూరి తనయుడు ఆకాశ్ కూడా ఓ కీ-రోల్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.