నర్సంపేట టౌన్ నేటి ధాత్రి:
నర్సంపేట, డిసెంబర్ 31: ప్రతి సంవత్సరం ఒక కొత్త క్యాలెండర్ మన జీవితంలోకి వస్తుందని, ఈ నూతన క్యాలెండర్ తో పాటు అనేక కొత్త కొత్త ఆశలు, ఆశయాలతో మరియు మనం చేరుకోవలసిన గమ్యాలు ఏర్పడతాయనీ, వాటికి అనుగుణంగా మనం మరింత నూతనోత్సాహంతో పనిచేయవలసి ఉంటుందనీ, అటువంటిప్పుడే ఈ నూతన సంవత్సరాలు జరుపుకోవడానికి ఒక అర్థం ఉంటుందని బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ అండృ రాజేంద్రప్రసాద్ రెడ్డి అన్నారు. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ లక్నేపల్లి శివారులోనే బాలాజీ టెక్నో స్కూల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేవలం ఈ ఒక్కరోజు ఆనందానికి పరిమితం కాకూడదని ఇష్టంతో కష్టపడి మీరు అనుకున్న గమ్యాలను చేరుకునేందుకు కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సూచించారు. అనంతరం కేక్ కట్ చేశారు . ఈ కార్యక్రమంలో బాలాజీ స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 2024 సంవత్సరంలో పాఠశాల సాధించిన ఘనవిజయాలను వివరించారు. అడ్వాన్సుగా ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులకు, విద్యార్థినీ విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాల బాలికలు డాన్సులు, ఉపన్యాసాలు, ఆట పాటలతో అలరించారు. ఈ సందర్భంగా చదువుల్లో ఉత్తమ పరిస్థితిను కనపరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. పదవ తరగతి రివిజన్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా అభినందనలతో పాటు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి రియాజుద్దీన్, క్రాంతి కుమార్, ప్రదీప్, భవానీ చంద్ మరియు విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
బాలాజీ టెక్నో స్కూల్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
