ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి
మహబూబ్ నగర్/నేటి ధాత్రి
గ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలంటే సీఎం కప్ ఓ వరమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్ రెండో రోజు కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కప్ 2024కు మహబూబ్ నగర్ వేదిక కావడం సంతోషంగా ఉందని, 33 జిల్లాలకు చెందిన బాలికలు మరియు బాలుర జుట్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి బడ్జెట్ పెంచడం, మినీ స్టేడియాలను నిర్మాణం చేపట్టుచున్నట్లు తెలిపారు. స్పోర్ట్స్ యునివర్సిటీ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ అథారిటీలను అనుసంధానం చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికితీసి ఒలింపిక్ క్రీడలలో మన రాష్ట్ర ప్రాతినిధ్యం వహించే విధంగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, టి.పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, డివైఎస్ఓ శ్రీనివాస్, కురుమూర్తి, సుధాకర్ రెడ్డి, ఏర్పుల నాగరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.