మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు
జమ్మికుంట: నేటి ధాత్రి
జమ్మికుంట పట్టణంలోని నాయని చెరువులో వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసినట్లు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు.జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులలో దాదాపు 150 కి పైగా వినాయక విగ్రహాల ప్రతిష్టాపన జరిగిందని నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలవకుండా భారీ క్రేన్లను చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేశామని, నిమజ్జనం చేయడానికి మున్సిపల్ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. వినాయక మంట పాల నిర్వాహకులు వినాయక విగ్రహాలను త్వరితగతిన శోభాయాత్రగా తీసుకొని వచ్చి సరైన సమయంలో నిమర్జనం చేసి వెళ్లాలని, వినాయక విగ్రహాలు వచ్చే దారిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ అధికారుల సమక్షంలో అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు అన్నారు. అదేవిధంగా చెరువు ప్రాంతంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు రెవెన్యూ, విద్యుత్ డిపార్ట్మెంట్ లతోపాటు మున్సిపల్ శాఖ అధికారులు సైతం అందుబాటులో ఉండి తగిన సహాయ సహకారాలు అందిస్తారని వెల్లడించారు. ప్రజలందరూ సంతోషకరమైన వాతావరణంలో వినాయక నిమజ్జనం చేసి వెళ్లాలని చైర్మన్ కోరారు.