Threats Over Illegal Hoardings Complaint
అక్రమ హోర్డింగ్ పై ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. – విజయ్ కుమార్ రెడ్డి
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
ట్విట్టర్ లో అక్రమ హోర్డింగ్స్ పెడుతున్నారని ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎన్ఆర్ ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోనీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… మాదాపూర్ లో అక్రమంగా(అనుమతులు లేకుండా) హోర్డింగ్స్ ఉన్నాయని ట్విట్టర్ లో పిర్యాదు చేశానన్నారు. శోభ రెడ్డి అనే మహిళ తనకు ఫోన్ చేసి, నా హోర్డింగ్స్పై ఎందుకు ఫిర్యాదు చేశావనీ బెదిరింపులకు పాల్పడిందనీ ఆరోపించారు.
గతంలో తనపై లోకాయుక్తలో కూడా ఫిర్యాదు చేశానని ఆమె వాదించినట్లు చెప్పాడు.
సైబరాబాద్ మున్సిపల్ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు కాపీని ట్విట్టర్లో పోస్టు చేసిన తర్వాత, తనను బంజారాహిల్స్కు పిలిపించి బెదిరించారని, రాజు అనే వ్యక్తి “నీకు బతకాలనుందా లేదా” అంటూ హెచ్చరించాడని, తన వెనుక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని బెదిరింపులకు దిగినట్లు పేర్కొన్నారు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన శోభ రెడ్డి, “ఈయనను వెంటనే కారులో ఎక్కించండి” అంటూ గట్టిగా అరిచిందని, పరిస్థితి అనుమానాస్పదంగా మారడంతో తాను వెంటనే అక్కడి నుంచి కారులో వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆమెపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
అక్రమ హోర్డింగ్స్ వ్యవహారానికి రాజు అనే వ్యక్తే సూత్రధారి అని, తనకు కొంతమంది మంత్రుల అండదండలు ఉన్నాయని అతడు చెప్పుకున్నట్లు ఆరోపించారు. ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ పేరు తాను ఎక్కడా ప్రస్తావించలేదని, కావాలనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని విజయకుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
గతంలో రాజ్ కుమార్, కిషోర్ తదితరులపై కేసులు పెట్టి ఒత్తిడికి గురి చేశారని కూడా ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
