Gas, Petrol & Diesel Stocks Ample in Bhupalpalli
జిల్లాలో గ్యాస్, పెట్రోల్ డీజిల్ సమృద్ధిగా నిల్వలు
గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై పటిష్ట పర్యవేక్షణ
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లాలో గ్యాస్, పెట్రోల్ డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
తెలిపారు.
శనివారం ఐడిఓసి కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఎస్పి సంకీర్త్ తో కలిసి జిల్లా ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై పటిష్ట పర్యవేక్షణ కొనసాగాలని ఆదేశించారు. గృహ అవసరాలకు విమియోగించే సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు.
జిల్లాలో మొత్తం లక్షా 20 వేల మంది గ్యాస్ వినియోగిస్తున్నారని తెలిపారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, ఆసుపత్రులకు యధావిధిగా గ్యాస్ సరఫరా జరుగుతుందని, ఆయా శాఖల అధికారులు. పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ అత్యవసర సేవలకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల్లో డిటీలు, ఎస్ ఐ.లు పర్యవేక్షణ చేస్తున్నారని, వాహనాలు తనిఖీ చేసి కేసులు నమోదు చేయాలని ఆర్టిఓ కు సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల బుకింగ్ సైకిల్ అమలులో ఉందని, బుకింగ్ క్రమం ప్రకారమే సిలిండర్ సరఫరా జరుగుతోందని తెలిపారు. సిలిండర్ డెలివరీ సమయంలో ఓటిపి విధానం తప్పనిసరిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల అమాంతం బుకింగ్లు పెరగడం వల్ల డిమాండ్ అధికమవుతోందని గుర్తించిన కమిటీ, ప్రజలు అవసరానికి మించి బుకింగ్ చేయకుండా, నిల్వలు చేయకుండా ఉండాలని సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లలో ఎల్పీజీ వినియోగంపై వెల్ఫేర్ అధికారి, డీఈఓ పర్యవేక్షణ చేయాలని, వార్డెన్లు, హెడ్మాస్టర్లు సరైన వినియోగం చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడైనా కొరత ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు.
జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్, అనధికార రీఫిల్లింగ్ సెంటర్లు, అక్రమ నిల్వలు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్యాస్, పెట్రోల్, డిజిల్ నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ, పోలీస్ శాఖతో కట్టుదిట్టమైన అమలు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగించడం, మళ్లింపు, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి మొత్తం 19 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. హోటళ్లు, ధాబాలలో అక్రమంగా వినియోగిస్తున్న సిలిండర్లను స్వాధీనం చేసుకుని, సంబంధితులపై నిత్యావసర వస్తువులు చట్టం 1955 సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేశామన్నారు.
కమిటీ కఠినంగా వ్యవహరించాలని నిరంతర తనిఖీలు, అప్రమత్తత ప ద్వారా అక్రమాలను పూర్తిగా అరికట్టాలని సూచించారు. అధికారులు పారదర్శక సరఫరా, సమర్థవంతమైన పర్యవేక్షణ, సమయానుకూల నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
ఎస్పి సంకీర్త్ మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ డీలర్లు తో సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మి ఆందోళన చెందొద్దని సూచించారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అసత్య ప్రచారాలపై పర్యవేక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి రద్దీ లేకుండా పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడోన్లు వద్ద పటిష్ట నిఘా.కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ డీఈఓ రాజేందర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సంక్షేమ శాఖల అధికారులు, హెచ్పీసీఎల్ సేల్స్ ఆఫీసర్ అమర్త్యదాస్ తదితరులు పాల్గొన్నారు.
