Municipal Taxes to Be Fully Collected
మున్సిపల్ పన్నులను 100 శాతం వసూలు చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతన్ పల్లి మున్సిపల్ పరిధిలో పన్నులను 100 శాతం వసూలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తో కలిసి పన్నుల వసూలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధి కొరకు పన్ను వసూలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలను త్వరితగతిన వసూలు చేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. పన్నుల వసూలు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు అందించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వేసవి కాలం అయినందున ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు నిబంధనల ప్రకారం త్వరగా ఇల్లు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
