Brahmotsavams to be Conducted with Grandeur at Kethaki Sangameshwara Temple
బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: అష్టతీర్థాల నిలయంగా, దక్షిణ కాశీగా పేరుగాంచిన ఝరాసంగం మండలంలోని కేతకి సంగమేశ్వర స్వామి మహాశివరాత్రి నవాహ్నిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు సంగారెడ్డి జడ్పీ సీఈవో జానకిరామ్, జహీరాబాద్ ఆర్డీఓ దేవుజా అధికారులను ఫిబ్రవరి 12 నుంచి 20 వరకు జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం ఎంపీడీవో సమావేశం మందిరంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శివరుద్రప్ప, జహీరాబాద్ డీఎస్పీ సైదా పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, రవాణా సౌకర్యాలు, ఆర్టీసీ, సంస్కృతిక, వైద్యం, ఐసిడిఎస్, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జాతర ముగిసే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. మహిళా భక్తులకు ప్రత్యేకంగా అధిక సంఖ్యలో తాత్కాలిక టాయిలెట్లు, స్నానాలకు అవసరమైనన్ని షవర్లు, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో కలిపి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. అధికారులందరూ భక్తి భావంతో సేవనందించాలన్నారు. దేవస్థానం వరకు వెళ్లే కనెక్టివ్ రోడ్లను మరమ్మతులు చేయించి గుంతలు పూడ్చాలని, అవసరమైన చోట సైన్బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, 108 అంబులెన్స్ను అందుబాటులో ఉంచాలని తెలిపారు. అగ్నిప్రమాదాల నివారణకు దేవస్థానం పరిసరాల్లో అగ్నిమాపక పరికరాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. భద్రతా పరంగా గుడి లోపల, బయట, ఆవరణలో, పార్కింగ్ ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమావేశం అనంతరం అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డిఎల్పిఓ అమృత, తహసిల్దార్ భాస్కర్, ఎంపీడీవో మంజుల, సీఐ హనుమంతు మండల వైద్యాధికారి రమ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు,
