Warangal Police Anti-Drug Awareness Drive
వరంగల్లో పోలీస్ జాగృతి కార్యక్రమం.
గంజాయి–డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించిన ఇంతేజార్గంజ్ ఎస్సై సందీప్.
నేటిధాత్రి, వరంగల్
వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు, సోమవారం నాడు జాగృతి పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేంద్రనగర్, కాశీబుగ్గ ప్రభుత్వ హై స్కూలులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై సందీప్ మాట్లాడుతూ విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు బానిసలవకుండా జాగ్రత్తపడాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, సేవించినా తప్పకుండా 8712584473 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే సైబర్ మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా మోసపోయిన వెంటనే సైబర్ హెల్ప్లైన్ 1930 కు కాల్ చేయాలని చెప్పారు. చదువుపై శ్రద్ధ పెట్టాలని, రోడ్డు ప్రమాదాలు, డయల్ 100 సేవలు, షీ టీమ్స్, ఈవ్ టీజింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు తల్లిదండ్రుల మాట వినడం ఎంతో ముఖ్యం అని పేర్కొన్నారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని, ఏ ప్రమాదంలోనైనా వెంటనే డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు. పోలీస్ జాగృతి కళా బృందం సభ్యులు పలు సామాజిక అంశాలపై ఆలపించిన పాటలు విద్యార్థులను చైతన్యవంతులను చేశాయి. ఈ కార్యక్రమంలో ఇంతేజార్ గంజ్ ఎస్సై రోహిత్, ఇంచార్జ్ హెడ్ మాస్టర్ సరోజిని, అధ్యాపక బృందం, హెడ్ కానిస్టేబుల్స్, బ్లూ కోట్ కానిస్టేబుల్స్, కళా బృందం సభ్యులు విలియమ్, వెంకటేశ్వర్లు, రత్నయ్య, హోమ్ గార్డ్స్ శ్రీనివాస్, నారాయణ, చిరంజీవి, అలాగే హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
