మంత్రి చుట్టూ జర్నలిస్ట్‌ భజన బందం

యదార్థవాధి లోకవిరోధి-1

మంత్రి చుట్టూ జర్నలిస్ట్‌ భజన బందం

ఇటీవల పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రైవేట్‌ పీఎల వ్యవహారంపై ‘నేటిధాత్రి’ కథనాలను ప్రచురించింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే పీఎల విషయంలో జాగ్రత్త, ప్రైవేట్‌ పీఎల నియామకానికి స్వస్తి పలకండి అని చెప్పి, ప్రభుత్వం కేటాయించే పీఎలను తానే నియమిస్తానని మంత్రుల ఇష్టా, ఇష్టాలకు సీఎం చెక్‌ పెడితే, అది కాదని చెప్పి ఎర్రబెల్లి ఏకంగా 20మంది పీఎలను నియమించుకున్నట్లు అందిన సమాచారంతో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ కథనం వెలువరించాం. ఈ కథనం రావడం మంత్రి దయాకర్‌రావుకు అంతగా నచ్చలేదు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఏకైక మంత్రిని తను చేస్తున్న పనులను ప్రశ్నిస్తారా…? ఆ పత్రికకు ఎంత ధైర్యం..? అంటూ అగ్గి మీద గుగ్గిలం అయ్యారట. ఈ మంటను తగ్గించుకోవడం కోసం తాను పిలవగానే ఎస్‌ బాస్‌ అంటూ వాలిపోయే కొంతమంది పెయిడ్‌ జర్నలిస్టులను పిలిపించి తన బాధనంత వెళ్లగాక్కాడట. మంత్రి బాధ బాగానే ఉన్న, కథనం కావల్సినంత వైరల్‌గా మారి ఎర్రబెల్లి పీఎల వ్యవహారం రాష్ట్రమంతా ప్రచారం అయిన కొంతమంది కబోధులకు అది మాత్రం కనపడలేదట. మంత్రి బాధను మొత్తం విన్న కొంతమంది జర్నలిస్టులను కథనాలను ‘గంజిలో ఈగ’లా తీసిపారేసారట. మీరేంటి…? మీ హోదా ఏంటి…? మీరు ధర్మ ప్రభువులు..దాన దయగుణం కలవారు అంటూ ఎలాంటి మొహమాటం లేకుండా కావాల్సినంత తెగ పొగిడెసి ‘నేటిధాత్రి’ సంగతి మేం చూస్తాం అంటూ భరోసానిచ్చారట. ‘తాను దూర సందులేదు మేడకో డోలు అన్నట్లు’ చేసే దందాలు, వసూళ్ల పర్వాల విషయం. వీరు పని చేస్తున్న యాజమాన్యాలకు తెలిసి వద్దుపొమ్మన్న బతిలాడి, బామాలి సూరు పట్టుకుని వేలాడుతున్న ప్రబుద్ధులు ‘నేటిధాత్రి’కి నీతులు వల్లించే స్థాయికి ఎదిగారట. ఎంతమాత్రం ఆత్మగౌరవం లేకుండా జర్నలిజం విలువల్ని బజారుకీడ్చి అక్రమార్కులు, రాజకీయ నాయకుల దగ్గర అక్షరాలను తాకట్టుపెట్టిన వీరికి ‘నేటిధాత్రి’ కథనాలను ప్రశ్నించే హక్కు ఎక్కడిదో అర్థం కావడం లేదు. జర్నలిజం వీరి ఇంటి సొత్తు అయినట్లు ‘నేటిధాత్రి’ ఉనికిని ప్రశ్నించే దమ్ము ఎక్కడిదో తెలియాలి. మా సంస్థను మేము కాపాడుకుంటూ ఉన్నంతలో జర్నలిజాన్ని బతికిస్తూ నిఖార్సయిన వార్తలతో ముందుకెళుతున్న మాపై వీరికి ఎందుకు ఇంత కళ్లు కుడుతున్నాయో అర్థం కాదు. సొల్లు వాగుడు, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు, ప్రెస్‌ నోట్లు, గిట్టుబాటు వార్తలు మాత్రమే రాయడం చేతనైన వీరు అవి కూడా ఘోస్ట్‌రైటర్స్‌తో రాయించుకుని మా వార్త అని జబ్బలు చరుచుకునే వీరికి ‘నేటిధాత్రి’ని శంకించే హక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేస్తున్నాం. ‘ఎనకటికి మా తాత ఎల్లగుర్రం ఎక్కాడు…ఏదో కాయ కాసింది’ అని ఇంట్లో సభ్యుల పేర్లు చెప్పుకుని లబ్ధి పొందే ఓ ఇద్దరు జర్నలిస్టులు తామే జర్నలిజం, తామే పైనుంచి ఊడిపడ్డాం. మాకే సర్వాధికారాలు ఉన్నాయన్నట్లు జర్నలిస్టుల భావప్రకటన స్వేచ్చకు అడ్డు తగిలే విధంగా, ఏ పత్రికలో, ఏ చానల్లో మంత్రికి వ్యతిరేక వార్తలు వస్తున్నాయో గుర్తించి మధ్యవర్తిత్వం వహించినట్లు నటించి, తాము చెప్పి కథనాలు రాకుండా చేస్తున్నాం అని మంత్రి వద్ద నమ్మబలికి లబ్ధిపొందుతున్న విషయం జర్నలిస్టులందరికి తెలిసిందే. ఇటీవల పెద్దపత్రిక మాది అంటూ బోర్డు తగిలేసుకుని ఊరేగే ఓ జర్నలిస్టు ‘నేటిధాత్రి’తో మాట్లాడాడు. మన జిల్లా మంత్రి గారు అంటూ ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తూ తాను అక్షరాలను వేలం పెట్టాను లెక్కగట్టి మరీ అమ్మేస్తున్నాను మీరు వేలం పెట్టండి, అమ్మకానికి సిద్దం కండి అంటూ రాయబారిగా వచ్చి బేరసారాలు నడిపే ప్రయత్నం చేశాడు. అది ఎంత మాత్రం కుదరకపోవడంతో ‘నేటిధాత్రి’ని పట్టించుకోవద్దని మంత్రికి ఉచిత సలహా ఇచ్చాడట. అణిచివేయబడ్డ వారు, సామాజికంగా వెనుకబడ్డ వారు అంటూ డైలాగులు తెగ వల్లించే ఈ జర్నలిస్టు ఏ సామాజికవర్గానికి లబ్ధి చేస్తున్నాడో కాస్త గురైరగాలి. ప్రజల పొట్టకొట్టి, అధికారం ఉంది కదా అని దోపిడికి పాల్పడుతూ ప్రజాధనాన్ని అడ్డగోలుగా స్వప్రయోజనాల కోసం వృధా చేస్తే ఎందుకు ప్రశ్నించకూడదో ఆ జర్నలిస్టు సమాధానం చెప్పాలి. నీతులు వల్లిస్తూ గోతులు తవ్వే అతగాడికి ‘నేటిధాత్రి’ని కామెంట్‌ చేసే అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలి. పత్రిక ఏదైనా జనం కోసం పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటుందని, కథనం ఏదైనా జనం నిజానిజాలు గ్రహించి కీలెరిగి వాత పెడతారనే కనీస అవగాహన ఉండాలి. జర్నలిజం అనగానే రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పైరవీలు, లబ్ధిపొందడాలు, ఆస్తులు సంపాదించి ఊరేగడం కాదని గుర్తుంచుకోవాలి. వసూళ్ల పర్వాన్ని యథేచ్చగా కొనసాగించడానికి ఇతర జర్నలిస్టులపై దుమ్మెత్తిపోసే నీతి బాహ్యమైన పనులు చెల్లవని ‘నేటిధాత్రి’ హెచ్చరిస్తుంది. నిజం ఎప్పటికైన గెలుస్తుంది. జర్నలిజం జనంపక్షానే ఉండి తీరుతుంది. మేం రాసే కథనాలపై అనుమానాలు ఉంటే మంత్రైనా ఎంతటివారైన వారికి ‘నేటిధాత్రి’ సమాధానం ఇస్తుంది. కథనాలపై అభ్యంతరం ఉంటే వారికి సంబంధించిన వివరణను ‘నేటిధాత్రి’ జర్నలిజం విలువలను గుర్తించి తప్పక ప్రచురిస్తుంది. ఏకపక్షంగా ఎప్పుడు వ్యవహరించదు. ఎవరిపై కథనం వచ్చిన వారు ‘నేటిధాత్రి’తో మాట్లాడుకుంటారు. కానీ కొంతమంది జర్నలిస్టుల పెత్తనం మా కథనాలపై చూపిస్తే సహించమని చెప్తున్నాం. మా ఉనికిని ప్రశ్నించవద్దని చెప్తున్నాం. మా పత్రికకు సంబంధించిన ప్రతినిధి మీడియా సమావేశంలో లేనప్పుడు దొంగచాటుగా మంత్రి దగ్గర బేష్‌ అనిపించుకునేందుకు సభ్యత మరిచి కామెంట్లు చేయకూడదని అంటున్నాం. అలా చేస్తే ధీటుగా సమాధానం చెప్పడం మాకు తెలుసని చెప్తున్నాం. వ్యక్తులు లేనప్పుడు వారి గురించి ప్రస్తావించడం సంస్కారం కాదని కుసంస్కార స్థాయికి దిగజారిన వారిని కోరుతున్నాం. పాతకాలపు మెదళ్లతో తిరుగుతూ ఎంతమాత్రం అప్‌డేట్‌ కాకుండా ఉండే మీకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ కంటే ‘వెబ్‌ జర్నలిజం’ అత్యంత వేగంగా దూసుకుపోతుందని వసూళ్లు తప్ప సమాజంలో వస్తున్న మార్పులపై ఎంతమాత్రం అధ్యయనం చేయలేని మీకు చెప్తున్నాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *