`తెలంగాణ లో బిఆర్ఎస్ తప్ప మరో పార్టీ లేదు.
`ప్రజల్లో కేసిఆర్ తప్ప మరో నాయకుడు లేడు.
`ప్రత్యామ్నాయానికి ఆస్కారమే లేదు.
`దేశం మొత్తం మీద అమలౌతున్న పథకాలకంటే బెస్ట్ పథకాలు తెలంగాణలో వున్నయ్ అంటున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు మాటామంతి…
`బిజేపిని నమ్మెటోడే లేడు.
`బిజేపికి అభ్యర్థులే లేరు.
`బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రతిపక్షమే లేదు.
`ప్రతిపక్షాలకు నియోజకవర్గ స్థాయి నాయకత్వం ఎక్కడా లేదు.
`కాంగ్రెస్ లో సీనియర్లమని చెప్పుకునుడు తప్ప, జనంలో ఎవరూ లేరు?
` తెలంగాణను సక్కవెట్టుడు తర్వాత ముందు ఇల్లు సక్కవెట్టుకుంటే సాలు.
`మాతో పోటీకొచ్చే వాళ్లే లేరు.
`తెలంగాణ తెచ్చిన కేసిఆర్ ప్రజల గుండెల్లో వున్నడు.
`తెలంగాణలో కేసిఆర్ ను కాదనుకునే కుటుంబమే లేదు.
`ఇంటింటికీ రైతు బంధు ఇస్తండు.
`దళితబంధు ఇస్తుండు.
`తెలంగాణ తెచ్చిండు…
`చెరువులు బాగు చేశిండు.
`ప్రాజెక్టులు కట్టిండు..
`కాలువలు తవ్వించి, పొలాలకు నీళ్లిత్తండు.
`ఎన్ని చేత్తండు…కళ్యాణలక్ష్మి ఇస్తండు.
`కేసిఆర్ కిట్ ఇస్తండు.
`అప్పట్ల పల్లెలెట్లున్నయ్…ఇప్పుడు పల్లెలెట్లున్నయ్..
`సూత్తె తెలుస్తలేదా…
`కాంగ్రెసొల్లకు కొట్లాటకే సరిపోతది.
`మళ్ల బిఆర్ఎస్సే వచ్చుడు ఖాయం.
`మెజారిటీ పెంచుకుంటం.
`వంద తెచ్చుకుంటం.
`బిఆర్ఎస్ ను ఆపడం ఎవల తరం కాదు.
హైదరబాద్,నేటిధాత్రి:
పదేళ్ల క్రితం తెలంగాణ వేరు..ఇప్పుడు తెలంగాణ వేరు. ఈ విషయం పదేళ్లు గడిచినా ప్రతిపక్షాలకు అర్ధం కావడంలేదు. అందుకే ప్రతిపక్షాలంటే తెలంగాణలో ప్రజలు చీదరించుకుంటున్నరు. కనీసం వాళ్లను ప్రజలు దగ్గరకు కూడా రానివ్వడం లేదు. రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రచారానికి వెళ్తే ఓ గిరిజన మహిళ ఎందుకొచ్చావని నిలదీసింది? ఈ విషయం మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయ్యింది. అయినా ప్రతిపక్షాలకు సోయి వస్తలేదు. ఇంటికి పెద్ద తండ్రిని తిడితే ఎవరికైనా కోపమొస్తుంది. అట్లాడే తెలంగాణలో ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి కేసిఆర్పై పనికి మాలిన ఆరోపణలు చేయడాన్ని ప్రజలు కూడా ఇష్టపడడం లేదు. అందుకే ప్రతిపక్షాలు ప్రచారానికి వెళ్లిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక ఎదురుదెబ్బ వారికి తగులుతూనే వుంది. బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ఏందో సంగ్రామ యాత్ర అని చేసిండు. అక్కడడక్కడ ఆగి మహిళలతో మాట్లాడిరడు..అప్పుడు ఈ గ్యాస్ ధరలేంది? గ్యాస్ ధరలు ఎప్పుడు తగ్గిస్తరు? పెట్రోలు ధరలేంది? వంట నూనెల ధరలేంది? అని ప్రశ్నించిండ్రు. ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలి..అక్కడినుంచి బండి సంజయ్ జారుకున్నడు. ప్రజలు ప్రతిపక్షాలను నిలదీస్తున్నరు..నిందిస్తున్నరు..మా దగ్గరకు రావొద్దని చెబుతున్నరు అనడానికి ఇంతకాన్నా నిదర్శనమేముంది. అంటే తెలంగాణలో ప్రజలు ఎవరి వైపు వున్నరో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాకుండా బండి సంజయ్ పచ్చని పొలాల మధ్య తిరుగుతూ, పక్కనే పోస్తున్న పంపు నీళ్లు తాగి కరంటు సక్కగొస్తుందా? అని అడిగితే ప్రజలు నవ్వుకుంటారన్న సోయి కూడ వుండొద్దా? మన ప్రతిపక్ష నాయకుల పని తీరు అట్లున్నది. అంటే వాళ్లకు తెలంగాణ ఆశ తెల్వదు. ఆశయం తెల్వదు. ప్రజలు ఏం కావాలో తెల్వదు. పైగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసిఆర్ ఇది లేదు అన్నంతగా అన్ని ఇచ్చినంక ఏమియ్యాలో తెలియక కూడా ప్రతిపక్షాలు జుట్టుపీక్కుంటున్నాయి. ఎన్నికల్లో ఏం చెప్పాలో కూడా తెల్వని పరిస్ధితి. అందుకే తెలంగాణలో మరో పార్టీకి స్ధానం లేదు. బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పధకాలు ఒక్క తెలంగాణలోనే అమలౌతున్నాయి. దేశమంతా మన తెలంగాణ వైపు చూస్తుంటే, తెలంగాణ ప్రజలు ప్రతిపక్షాల వైపు చూస్తారని ఆశ పడడం భ్రమే అవుతుంది. సహజంగా ప్రతిపక్షాలు నిర్మాణాత్మక వైఖరి అవలంభించాలి. ఎంత సేపు తెలంగాణలో బిఆర్ఎస్ను ఓడగొట్టాలే…గిదేనా ప్రతిపక్షాలకు వుండే లక్ష్యం. ప్రజలకు ఏం చేయాలో చెప్పుకోవాలి. ప్రజలను ఒప్పించాలి. ప్రజలకు విశ్వాసం కల్గించాలి. ఇవన్నేవీ కుదరదు. కాని తెలంగాణలో అధికారంలోకి రావాలి..ఇలా పగటి కలలు కంటూనే వుంటారు..కాలం గడుస్తూనే వుంటుంది. తెలంగాణలో మరో రెండు దశాబ్ధాలైనా కాంగ్రెస్, బిజేపిలో అధికారంలోకి వచ్చేది లేదు. పట్టుమని పది సీట్లు గెలిచేది లేదు. వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అఖండ మెజార్టీతో, 105 సీట్లతో గెలుస్తున్నం..అంతే…అంటున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో మాటా మంతి…ఆయన మాటల్లోనే…
ప్రజలు ఎక్కడైనా సంక్షేమ పాలన కావాలని కోరుకుంటారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాజకీయ పార్టీలు కూడా అవే చెబుతుంటాయి. వీటన్నింటికీ తోడు తెలంగాణ రాజకీయాలకు ప్రత్యేకమైన స్ధానం వుంది. తెలంగాణ కొట్లాడి సాధించుకున్న రాష్ట్ర్రం. 60 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో వెలివేయబడ్డ ప్రాంతగా, అప్పటి పాలకుల దయాదాక్షిణ్యాల మీద పొద్దు బుచ్చుకున్న ప్రాంతం. అప్పటి పాలకులు ఇచ్చిందే ప్రసాదం…పెట్టిందే పరమాన్నం అన్నట్లు భావించాల్సివచ్చింది. కాని ఇప్పుడు మన తెలంగాణ. మన పాలన. కొట్లాడి తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో సాగుతున్న సంక్షేమ పాలన. ఇంతకన్నా ప్రజలు ఏం కోరుకుంటారు? సరే ప్రతిపక్షాల కోరుకుంటున్నట్లు జరిగినా…ముఖ్యమంత్రి కేసిఆర్ కన్నా మెరుగైన పాలన అందించే ఆలోచన వున్న నాయకుడు కూడా ప్రతిపక్షాల్లో లేడు. ప్రజా సంక్షేమం అంత అవగాహన వున్న నాయకుడు లేడు. తెలంగాణ గోస తెలిసినోళ్లు కాదు. తెలంగాణ పరిస్ధితులు తెలుసుకున్న వాళ్లుకాదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణపై జరిగిన వివక్ష కళ్లారా చూసి, కన్నీళ్లు పెట్టుకున్న కేసిఆర్ మాత్రమే తెలంగాణ కోసం అహర్నిషలు ఆలోచించగలుగుతాడు. అన్నది తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణ వస్తే ఏమొస్తది అని ఎగతాళి చేసిన వాళ్లు ఇప్పుడు తెలంగాణ చూసి మురిసిపోతున్నరు. అబ్బురు పడుతున్నరు. తెలంగాణ పల్లెలో సిరికాంతులు వెదజల్లుతున్నాయి. ఒకనాడు పల్లెలో ఏముందనేవారు. మహాత్మాగాంధీ ఒకనాడు పల్లెలె పట్టుగొమ్మలని ఎందుకన్నారో ఇప్పుడు తెలంగాణ చూస్తే అర్ధమౌతుంది. ఊరు ఆగమైన కాలం నుంచి ఊరుంతా రోజూ ఉగాది చేసుకునేంత పండగు నేడు వచ్చింది. ఇది చాలదా? ఇలాంటి పాలన ఏ నాయకుడైనా ఇస్తాడా? ఇస్తే దేశంలో డెబ్బై ఎళ్లు పాలించిన కాంగ్రెస్ ఏరాష్ట్రంలోనైనా అనుసరించిందా? కనీసం తెలంగాణలో అమలౌతున్న పధకాలు అమలు చేస్తామన్న ఆలోచనైనా చేస్తుందా?
ఆంగ్లేయుల ఏలుబడిలో వున్న ఆంధ్రప్రదేశ్లో దవళేశ్వరం కట్టిన కాటన్ దొరను ఇప్పటికీ అక్కడి ప్రజలు కొలుస్తున్నరు.
మరి తెలంగాణలో అపరభగీరదుడైన ముఖ్యమంత్రి కేసిఆర్ను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అక్కడ ఒక్క ప్రాజెక్టు నిర్మాణంచేసిన కాటన్ దొరకే అంత గుర్తింపు వుంటే, తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు…ఎన్ని రిజర్వాయర్లు..ఎన్ని కాలువలు…! అసలు ఎవరైనా ఊహించారా? తెలంగాణ వస్తే మన నీళ్లు మనకే అనుకున్నామే..గాని మన నీటి వినియోగం ఇంతలా జరుగుతుందని అనుకున్నామా? అసలు తెలంగాణలో ప్రాజెక్టులు కలగన్నామా? కాని ఒక్క కేసిఆర్ మాత్రమే కలగన్నారు. ఆ కలను నిజం చేసి, తెలంగాణ ప్రజలు బహుమతిగా ఇచ్చారు. తెలంగాణలో చెరువులు బాగు పడితే చాలని అనుకున్న రోజుల నుంచి అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేసి, తెలంగాణ పల్లెల్లో చెరువులు బాగు చేసి, వాటిని ఏడాది పొడవునా నిండు కుండల్లా చేసి నీళ్లు నింపుతుంటే ఇంతకన్నా గొప్ప పాలన ఎక్కడైనా వుంటుందా? ఇది ప్రతిపక్షాలకు తెలుసు. అయినా రాజకీయంగా మనుగడ కోసం వాళ్ల ఆరాటం వాళ్లది. అందుకే ప్రజలు కూడా ప్రతిపక్షాలను పెద్దగా పట్టించుకోవడం మానేశారు. బిఆర్ఎస్ను గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తున్నారు. తెలంగాణ వచ్చాక గెలిచిన సీట్లకంటే 2018లో ఎక్కువ గెలిచాం. 60 నుంచి 88కి పెరిగాం. ఈసారి 105 సాధిస్తాం. ఇక ప్రతిపక్షాలకు తెలంగాణలో తావులేదని మరోసారి నిరూపిస్తాం. బంగారుతెలంగాణ నిర్మాణం అన్నది నిజం చేసిన పార్టీ బిఆర్ఎస్. నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్. తెలంగాణలో అన్ని రంగాల్లో ప్రగతి, పురోగతి సాధించింది. తెలంగాణలో మరే కొత్త అభివృద్ధికి శ్రీకారం జరగాలన్నా మళ్లీ ముఖ్యమంత్రి కేసిఆర్తోనే సాధ్యం. విషయంలేని, విజన్ లేని ప్రతిపక్షాలను ప్రజలు ఎట్టిపరిస్ధితుల్లో నమ్మే పరిస్దితి లేదు. రాదు కూడా…తెలంగాణ సాధించి దశాబ్ధ కాలం గడుస్తున్న శుభ సందర్భంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకొని,ప్రజలకు మరిన్ని కొత్త భవిష్యత్తు కార్యక్రమాలు అందిస్తాం…తెలంగాణ దేశానికి ఆదర్శం చేస్తాం..ఇప్పటికే దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. దేశమంతా బిఆర్ఎస్ విస్తరిస్తోంది. పొరుగు రాష్ట్రాలలో ఇప్పటికే జనంలోకి బాగా వెళ్తోంది. మహారాష్ట్ర లో దూసుకుపోతోంది. రైతు రాజ్య భావనే కాదు, స్ధాపన కూడా ఒక్క కేసిఆర్తోనే సాధ్యమని దేశం కూడా నమ్ముతోంది. దేశం కేసిఆర్ నాయకత్వం కోరుకుంటోంది.