సీజ్‌ చేసిన ఇసుకేమైంది?

` కంచె చేసు చేసినట్లు కాపాడాల్సిన అధికారులు ఇసుక మాయం పట్టించుకోరా?

`డాన్‌ శీను తలుచుకుంటే సీజింగ్‌ కూడా లెక్కచేయడా!

` డాన్‌ శీను సాగిస్తున్న నిర్వాకం!

` చోద్యం చూస్తున్న అధికార గణం!

` పై అధికారుల కన్నా డాన్‌ శీనునంటేనే గౌరవం.

` కోట్లు ఖర్చు చేసినా రాని పబ్లిసిటీ నేటిధాత్రితో వస్తుందంటున్న శీను.

` హైదరాబాద్‌ లో వున్నా దందా చేసే అవకాశం దొరుకుందని ధీమా!

` అవసరం వున్న వాళ్లు బండ్లగూడకు వచ్చేందుకు మార్గం ఏర్పడిరదట!

` రెండు శాఖల అధికారులంటే డాన్‌ శీనుకు ఎంత చులకనో అర్థం చేసుకోవచ్చు?

`పోలీసులు సీజ్‌ చేసిన వెహికిల్‌ బైటకు రాదు!

` అలాంటిది సీజ్‌ చేసిన ఇసుక అమ్ముతుంటే ఏం చేస్తున్నారు?

`వెహికిల్‌ ఛలాన్‌ వుంటే అప్పుడు వసూలు చేస్తారు?

`డాన్‌ శీను నుంచి ఎగ్గొట్టిన పన్నులు వసూలు చేయలేరా?

` సిఎస్‌ గారు అధికారుల నిర్లక్ష్యం, కాసుల కక్కుర్తి చూడండి!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మంచిర్యాల జిల్లాలో డీలర్‌ శీను అలియాస్‌ డాన్‌ శీను ప్రభుత్వం సీజ్‌ చేసిన ఇసుక కూడా అమ్ముకున్నాడన్న విషయం వింటే ఆశ్చర్యం కలగకమానదు. అలాంటప్పుడు అక్రమంగా తవ్వకాలు చేపట్టి, ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి శీను అమ్ముకుంటున్న ఇసుకను అధికారులు ఎందుకు సీజ్‌ చేసినట్లు? ఆ ఇసుక డంపుల చుట్టూ ఎందుకు కంచెలు ఏర్పాటు చేసినట్లు? ఏర్పాటు చేసిన కంచె మాయమైతే అధికారులు ఏం చేస్తున్నట్లు? సీజింగ్‌ లో వున్న ఇసుకను డాన్‌ శీను దర్జాగా తరలించి అమ్ముకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు? ప్రభుత్వ ధనంతో ఇసుక డంపులకు ఫెన్సింగ్‌ ఎందుకు వేసినట్లు? అలా కూడా అధికారులే ప్రజాధనం వృధా చేయడం ఎందుకు? ఇవన్నీ అధికారులు ఎందుకు చేసినట్లు? కంచె చేను మేసినట్లు కాపాడాల్సిన అధికారులు ఇసుక మాయం పట్టించుకోరా? అక్రమ ఇసుక రవాణా చట్టరిత్యా నేరం. ఎంతో కట్టుదిట్టమైన చట్టాలున్నాయి. మైనింగ్‌ విషయంలో పొరపాట్లు చేసేవారిని ఉపేక్షించేంత ఉధాసీనత ఒక్క మంచిర్యాల జిల్లాలో తప్ప, దేశంలో ఎక్కడా వుండకపోవచ్చు. అధికారులలో ఒకరో, ఇద్దరో అవినీతి పరులు వుంటారని అనుకుంటాం! అదేమిటో మంచిర్యాల జిల్లాలో ఏ మండలాన్ని కదిలించినా, ఏ శాఖ గురించి చెప్పుకున్నా కథలు, కథలుగా అధికారుల తీరు చెబుతుంటారు. శీనుకు ఎలా ఉపయోగపడతారో పూసగుచ్చినట్లు వివరిస్తుంటారు. 

డాన్‌ శీను తలుచుకుంటే సీజింగ్‌ కూడా లెక్కచేయడా!

 అంతటి ధైర్యం ఏమిటి? అధికారులను ఎంత గుప్పిట్లో పెట్టుకోకపోతే ఇంతలా భరితెగిస్తాడు. అసలు జిల్లాలో ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థను శీను నడిపేంత పెద్ద వాడిని చేసింది అధికారులు కాదా? శీను అడుగులకు మడుగులొత్తుతోంది అధికార యంత్రాంగం కాదా? డాన్‌ శీను సాగిస్తు నిర్వాకమా? లేక అధికారుల ప్రోత్సాహమా? జిల్లాలో ఇంతటి ఘటన చోటు చేసుకుంటున్నా? అడ్డుకోలేని అధికార గణం ఎవరికి కొమ్ముకాస్తున్నట్లు? పై అధికారుల కన్నా డాన్‌ శీనునంటేనే గౌరవం ప్రదర్శిస్తున్నట్లు కాదా? 

 ప్రభుత్వాన్ని మోసం చేసి అధికారులను గుప్పిట్లో పెట్టుకొని అక్రమ ఇసుక వ్యాపారం చేసుకుంటున్న డాన్‌ శీనుకు నేటిధాత్రి వార్తలు పబ్లిసిటీకీ పనికొచ్చేలా వున్నాయట?

 అంటే అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, నిర్లిప్తత, చేతకాని తనం,ఒక వ్యక్తికి దాసోహమైన క్రమం కనిపిస్తోంది. కోట్లు ఖర్చు చేసినా రాని పబ్లిసిటీ నేటిధాత్రితో వస్తుందని సన్నిహితులతో అంటున్నాడట. అలా శీను మారడానికి పరోక్ష కారణం అధికారుల ఉదాసీనత, కక్కుర్తి కారణం కాదా? తాను హైదరాబాద్‌ లో వున్నా దందా చేసే అవకాశం దొరుకుందని ధీమా! వ్యక్తం చేసేంత శీను ధైర్యానికి అవినీతి అధికారుల అండ కాదా? అవసరాన్ని బట్టి అధికారులే బండ్ల గూడకు వచ్చి పనులు చక్కదిద్దుతారని శీను చెప్పుకుంటున్నాడంటే, ఇంతకంటే సిగ్గు మాలిన తనం అధికారులకు వుంటుందా? దీన్ని బట్టి ఆ రెండు శాఖల అధికారులంటే డాన్‌ శీనుకు ఎంత చులకనో అర్థం చేసుకోవచ్చు?

ఇటీవల కాలంలో బైక్‌ మీద ఛలాన్లు వుంటేనే పోలీసు శాఖ వెంటాడి వేధించినంత పని చేస్తోంది.

 అలాంటిది శీను విషయంలో ఎందుకు ఉదాసీనత ప్రదర్శిస్తోంది. సహజంగా పోలీసులు సీజ్‌ చేసిన వెహికిల్‌ బైటకు రాదు! అలాంటిది అధికారులు దగ్గరుండి సీజ్‌ చేసిన ఇసుక కాపాడలేకపోవడంలో ఆంతర్యమేమిటన్నది చూస్తేనే అర్థమౌతుంది.  

 ఇంతకీ డాన్‌ శీను ప్రభుత్వానికి ఎగ్గొట్టిన పన్నులు వసూలు చేయరా? చేయలేరా?

 చేయకూడదని నిర్ణయించుకున్నారా? విజిలెన్స్‌ రిపోర్ట్‌ పక్కన పెట్టేశారా? దానిని అమలు చేసే ఉద్దేశం అసలే లేదా? ఆర్డీవో స్థాయి అధికారులు కూడా శీను చేసే అక్రమాలకు వంత పాడడం విచిత్రంగా వుంది. నేటిధాత్రి ఈ విషయంలో ఇప్పటికే అనేక కథనాలు ప్రచురించింది. డాన్‌ సీను వ్యవహారం మూలంగా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లు తహసీల్దారు కార్యాలయాల ముందు ధర్నాలు చేసిన సందర్భాలు అనేకం వున్నాయి. అయినా స్పందించిన అధికారి లేడు. ప్రజా ప్రతినిధులు లేరు. ఎంతో సిఎస్‌ గారు అధికారుల నిర్లక్ష్యం, కాసుల కక్కుర్తి చూడండి! ఒక్కసారి సీజ్‌ చేసిన ఇసుక కుప్పలు చూడండి… తరలించుకుపోగా మిగిలిందెంతో నిగ్గు తేల్చండి. ఒక్క సారి ఈ విషయంపై స్పందించండి. ఒక వ్యక్తి ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థను నడిపిస్తున్నాడంటే ఇది ఎవరి లోపం. అధికార యంత్రాంగం ఇంత దిగజారిపోవాలా? శీను ఆగడాల మీద వెల్లువెత్తిన నిరసనలు, పిర్యాదుల మీద ఎమ్మెల్యే బాల్క సుమన్‌ స్పందించారు. శీనును బెదిరించారు. అతను జిల్లా వదిలి హైదరాబాదు లో మకాం పెట్టాడు. అయినా అధికారులకు ఈ దేబిరింపు ఏమిటి? ఒక అక్రమార్కుడికి కొమ్ము కాయడం ఏమిటి? అతను ఎలా చెబితే అలా వినడం ఏమిటి? ప్రజల భూములను శీనుకు అప్పగించడం ఏమిటి? ఇసుక వ్యాపారానికి సహకరించడమేమిటి? పన్ను ఎగ్గొట్టినా స్పందించకపోవడమేటి? అక్రమార్కులకు అధికారులు ఇలా దాసోహమేమిటి? ఉన్నత స్థాయి అధికారులకు అంతా తెలిసినా పట్టింపేది? ఎప్పుడు డాన్‌ శీను ఆగడాలకు అడ్డకట్ట పడేది? ప్రభుత్వం అబాసుపాలౌతున్నా అధికార పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఎందుకు స్పందించడం లేదు. వీటన్నింటికీ సమాధానం ఎవరు చెప్పాలి? ప్రజల ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోవాలో రాష్ట్ర స్థాయి అధికార గణమే సమాధానం చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *