కార్మికుల చలివేంద్రానికి ప్రత్యేక ఆకర్షణ
కళ్లాపి జల్లి ముగ్గులతో సంప్రదాయ శోభ
పరకాల,నేటిధాత్రి
పట్టణంలో వేసవి దాహార్తిని తీర్చేందుకు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.సాధారణంగా ఏర్పాటు చేసే చలివేంద్రాలకు భిన్నంగా ఈ చలివేంద్రాన్ని సంప్రదాయ పద్ధతిలో అలంకరించడం ప్రజలను ఆకట్టుకుంది.చలివేంద్రం పరిసరాల్లో కాళ్లాపి జల్లి,రంగురంగుల ముగ్గులు వేయడం ద్వారా ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు.దారిన వెళ్లే ప్రజలు చలివేంద్రం వద్ద ఆగి నీరు సేవించడంతో పాటు అలంకరణను ఆసక్తిగా వీక్షించారు.భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు మాట్లాడుతూ కేవలం దాహం తీర్చడమే కాకుండా సంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించేలా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రజలకు సేవ చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.స్థానికులు ఈ వినూత్న ప్రయత్నాన్ని అభినందిస్తూ ఇతరులు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ప్రత్యేకత చూపాలని సూచించారు.
