TJS Demands More Procurement Centers
కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యమే రైతు ప్రాణం తీసింది
రైతు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
కాంటాలు, బస్తాల కోసం నెలరోజులుగా రైతుల నిరీక్షణ
కొనుగోలు ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శ
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట, నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన రైతు గాజుల పెద్ద వెంకటేశ్వర్లు కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యమే వల్లనే నేడు రైతు ప్రాణం తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతు మృతికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యంతో రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 45 డిగ్రీల ఎండలో కాంటాలు, బస్తాల కోసం ఎదురుచూస్తూ రైతులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. అలంకానిపేట కొనుగోలు కేంద్రంలో వడ్ల కాంటా కోసం, కాపులకనపర్తి కేంద్రంలో మక్కజొన్నల అమ్మకాల కోసం వెంకటేశ్వర్లు నెలరోజులుగా తిరుగుతూ తీవ్ర ఒత్తిడికి గురై మృతి చెందారని తెలిపారు.
ప్రతిపక్షాలు, రైతులు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. సాగు విస్తీర్ణం, పంట దిగుబడులపై ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్లే కొనుగోలు కేంద్రాలు సరిపడా ఏర్పాటు చేయలేకపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతి, చిల్లర దందాల కారణంగానే కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోందన్నారు.
ధాన్యం తరలింపు, గోదాముల నిర్వహణపై స్థానిక ఎమ్మెల్యే, అధికారులకు స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం చలనం చూపడం లేదన్నారు. రెండు నెలలుగా మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తిచేయలేకపోయిన ప్రభుత్వం రైతులను అన్ని దశల్లో ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.ప్రభుత్వం ఇప్పటికైనా అలసత్వం వీడి కొనుగోలు కేంద్రాలను పెంచి, రైతుల ధాన్యాన్ని వెంటనే తరలించే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.
