Balka Suman Alleges Irregularities in Kothapalli Municipal Election
చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమయింది…
రెవెన్యూ , పోలీస్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులా..? విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులా..,?
“ఐ లవ్ యూ” మంత్రి వివేక్.. కావాలనే బాగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
*చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
మున్సిపల్ ఎన్నిక కాకుండా చూస్తే ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లే…
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఐ లవ్ యూ మంత్రి వివేక్ అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.ప్రజలంతా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల తీరును గమనిస్తున్నారని
పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఎప్పుడు కక్ష సాధింపు చర్యలకు దిగలేదని, అందరినీ కలుపుకుపోయామే తప్ప కక్ష సాధింపు చర్యలకు ఏనాడూ దిగలేదని మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదలైన అనంతరం క్యాతన్ పల్లి లోని బాల్క సుమన్ తన నివాసానికి చేరుకున్న సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మూల రాజిరెడ్డి లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రమంతటా పరిస్థితి దారుణంగా తయారయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్ ఆయన కుమారుడు ఎంపీ వంశీకృష్ణ లు బిఆర్ఎస్, సిపిఐ పార్టీల 14 మంది కౌన్సిలర్లను కొనే ప్రయత్నం చేశారని అన్నారు. బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు ఆఫర్లు చేశారని అయినా సరే తమ కౌన్సిలర్లు తలొగ్గ లేదన్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ లు మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మెన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ కౌన్సిలర్ల కు మందు తాగించి తమ మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేపించారని మండిపడ్డారు. ప్రజా తీర్పును మంత్రి వివేక్ గౌరవించడం లేదని విమర్శించారు. క్యాతనపల్లి లో గొడవ సందర్భంగా రాళ్ళు విసిరినోళ్ల మీద కేసులో బుక్ కాలేదని, మా పార్టీకి చెందిన 25 మంది మీద కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా క్యాతన్ పల్లి మున్సిపల్ ఆఫీస్ కి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. మంత్రి వివేక్ కాన్వాయ్ ను ఎలా పంపించారని అడిగితే పోలీసులు తమపై లాఠీ ఛార్జ్ చేశారని పేర్కొన్నారు. వాళ్లు దాడి చేస్తే మాపైనే రివర్స్ లో కేసు పెట్టారని మండిపడ్డారు. క్యాతన్ పల్లి లో కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మున్సిపల్ పీఠం ఎలా వస్తుందని మండిపడ్డారు. జిల్లాలోని కలెక్టర్ నుండి ఎమ్మార్వో వరకు ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. జైలు లోపల కూడా తమని ఇబ్బంది పెట్టారని తెలిపారు. జైలులో ఉండగా రామకృష్ణాపూర్ ఎస్సై నా ఇంటిని ఏ విధంగా సోదా చేస్తారో తెలపాలని సుమన్ ప్రశ్నించారు.అక్రమంగా నన్ను జైల్లో పెట్టారని ఇప్పుడు వారి కడుపు మంట తగ్గిందని అనుకుంటున్నానని అన్నారు. సిపిఐ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్నాయని ,పొత్తు ధర్మాన్ని విస్మరించే ప్రసక్తే లేదని , భవిష్యత్తులో కూడా పొత్తుతోనే వెళ్తామని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య స్పష్టం చేశారు.క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికను ఇప్పటికైనా సవ్యంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
