టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్
టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ తన సూపర్ ఫామ్ను కొనసాగించాడు. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో సెంచరీ బాది.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్( T20 World Cup 2026) టోర్నీ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. నిన్న(శనివారం) శ్రీలంక జట్టుపై విజయం సాధించినప్పటికీ నెట్ రన్రేట్ తక్కువగా ఉండటంతో సెమీస్ కు చేరలేకపోయింది. ఇంతటి నిరాశలో పాకిస్థాన్ జట్టుకు ఊరటనిచ్చే అంశం ఒకటి ఉంది. ఆ జట్టు యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ తన సూపర్ ఫామ్ను కొనసాగించాడు. పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్లో ఫర్హాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు.
గ్రూప్-2లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో ఫర్హాన్ 60 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ అద్భుత ఇన్నింగ్స్తో ఫర్హాన్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అలానే క్రికెట్ దిగ్గజ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డును కూడా ఫర్హాన్ బ్రేక్ చేశాడు. టీ20 ప్రపంచ కప్ ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు కోహ్లీ పేరిట ఉండేది. టీ20 ప్రపంచకప్ 2014లో విరాట్ 319 పరుగులు చేశాడు. 2026 ఎడిషన్లో ఫర్హాన్ 383 పరుగులు చేసి.. కోహ్లీ ఆల్టైమ్ రికార్డును ఫర్హాన్ బద్దలు కొట్టాడు. అలానే టీ20 వరల్డ్కప్ ఒక ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా వెస్టిండీస్ ప్లేయర్ షిమ్రోన్ హెట్మయెర్(17)ను ఫర్హాన్(18) అధిగమించాడు. అలానే పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్లో రెండు సెంచరీలు బాదిన తొలి బ్యాటర్గా ఫర్హాన్ అరుదైన ఘనత సాధించాడు. అదేవిధంగా టీ20 ప్రపంచకప్లో రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ సరసన ఫర్హాన్ చేరాడు.
