గ్రామాల్లో బెల్ట్ షాపుల హవ
గ్రామాలలో ప్రధాన సమస్యగా మారుతున్న మద్యం దుకణాలు
అర్ధరాత్రి వరకు అదుబాటులో మద్యం
పరకాల,నేటిధాత్రి
మండలంలోని పలుగ్రామాలలో అక్రమ మద్యం విక్రయాలు రోజురోజుకు విస్తరిస్తూ సామాజిక సమస్యగా మారుతున్నాయి.అధికారిక మద్యం దుకాణాలు ఉన్నప్పటికీ,వాటిని పక్కనబెట్టి గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు పుట్టుకొస్తుండటం గ్రామస్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.నియమ నిబంధనలను పట్టించుకోకుండా కొందరు వ్యక్తులు ఇళ్లలోనే మద్యం నిల్వచేసి విక్రయాలు నిర్వహిస్తూ సులభంగా డబ్బు సంపాదనకు పాల్పడుతున్నారు.ప్రత్యేకంగా సాయంత్రం మొదలుకొని అర్ధరాత్రి వరకు ఈ బెల్ట్ షాపులు రద్దీగా కొనసాగుతున్నాయి.గ్రామాల్లో పని ముగించుకున్న తరువాత చాలా మంది ఈ ప్రాంతాలకు వెళ్లడం అలవాటుగా మారింది.యువత ఈ అలవాటుకు బానిసలవుతుండటంతో వారి భవిష్యత్తుపై ప్రభావం పడుతోందని పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మద్యం వినియోగం పెరగడం వల్ల కుటుంబాల్లో కలహాలు,ఆర్థిక ఇబ్బందులు అధికమవుతున్నాయి.కొందరు కుటుంబాలు అప్పుల బారిన పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.మహిళలు,వృద్ధులు ఈ పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇంటి శాంతి భంగం చెంది కుటుంబ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.దీంతో సాధారణ ప్రజలు,ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలు భయాందోళనలకు గురవుతున్నారు.గ్రామ శాంతిభద్రతలకు ఈ పరిస్థితులు సవాలుగా మారుతున్నాయి.ఇలా గల్లీ గల్లీకి విస్తరిస్తున్న బెల్ట్ షాపులు గ్రామ జీవన విధానాన్ని మెల్లగా దెబ్బతీస్తున్నాయి.సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణం క్షీణించడంతో పాటు,యువతలో చెడు అలవాట్లు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పరకాల మండలంలోని పలుగ్రామాలలో అక్రమ మద్యం విక్రయాలను నియంత్రించి, బెల్ట్ షాపుల పెరుగుదలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.గ్రామాల్లో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు సమాజం మొత్తం ముందుకు రావాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
