కేతకీ సంగమేశ్వర ఆలయంలో దళారుల దౌర్జన్యం…

కేతకీ సంగమేశ్వర ఆలయంలో దళారుల దౌర్జన్యం

◆- అనధికార పూజారుల ఆగడాలు

◆- ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం

◆- చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీటీసీ డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఫిబ్రవరి 05 ఝరాసంగం కేతకీ సంగమేశ్వర ఆలయంలో కొంతమంది దళారులు, అనధికార పూజారులు అడ్డగోలుగా వ్యవహరిస్తూ భక్తులను వేధిస్తున్నారని ఝరాసంగం మాజీ ఎంపీటీసీ రజిని ప్రియ సంతోష్ పటేల్ తీవ్రంగా ఆరోపించారు. పూజల పేరుతో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ, రసీదులు ఇవ్వకుండా ఆలయ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనధికార పూజారులు అభిషేకాలు, అర్చనలు, గుండం పూజలు, వాహన పూజలు, నిత్యాన్నదానం పేరుతో సొమ్ము కాజేస్తూ గుండాయిజానికి పాల్పడుతున్నా ఎండోమెంట్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల అండదండలతో వీరు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపించారు. గురువారం ఆలయంలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనమని తెలిపారు.

గుండం పూజ పేరుతో ఒక అనధికార దళారి పూజారి భక్తుల వద్ద నుంచి రసీదు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బందులు కలిగించడంతో, భక్తులు ఆలయ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో చైర్మన్‌ మరియు అనధికార దళారి పూజారి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇలాంటి అనధికార దళారులు, పూజారులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయంలో పూజలు పూర్తిగా రసీదు విధానంలోనే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఎండోమెంట్ అధికారులను రజిని ప్రియ సంతోష్ పటేల్ డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version