కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం విఫలం…

కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం విఫలం
నేటి ధాత్రి : శ్రీరాంపూర్

కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) విఫలమైందని, ఎఐటియుసి యూనియన్ గుర్తింపు సంఘంగా ఎన్నికైన గత రెండు సంవత్సరాల నుండి కార్మిక వర్గ పక్షాన పోరాడకుండా మౌనం వహించిందని ఐఎన్టియుసి సీనియర్ ఉపాధ్యక్షులు ధర్మపురి, సీనియర్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్ రావు ఆరోపించారు. సోమవారం శ్రీరాంపూర్-నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఏఐటీయూసీ యూనియన్ సింగరేణి, ప్రభుత్వ కార్యకలాపాలలో ఇతర యూనియన్ లను దగ్గరకు రానివ్వలేదని విమర్శించారు. సన్మానాలు, గుడి కమిటీ, క్యాంటీన్ కమిటీలకు సంబంధించిన హక్కులు అనుభవిస్తూ, ఇతర సంఘాలు మీటింగ్ లు పెడితే చార్జిషీట్లు, సస్పెండ్ లకు గురిచేస్తూ, విజిలెన్స్ పేరిట దాడులు చేయించారన్నారు. కార్మిక వర్గం నష్టపోతుంటే ఏ రోజు కూడా మౌనం వీడని సంఘమని అన్నారు. భూపాలపల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు లోపు కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ప్రకటించే తరుణంలో దీనిని దృష్టిలో ఉంచుకొని ఏఐటియుసి నల్ల బ్యాడ్జీలు, ధర్నాలు, బస్సు జాత పేరిట రకరకాల విన్యాసాలకు పాల్పడుతుందని ఐఎన్టీయూసీగా భావిస్తున్నామని అన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాల మూడు నెలల కాలం గడిచిందని, ఈ కాలంలో ఏఐటీయూసీ కార్మికుల కొరకు ఈ డిమాండ్లు తీసుకొచ్చామని, ఈ అగ్రిమెంట్లు చేశామని చెప్పిన పాపాన పోలేదని విమర్శించారు. నేడు సేవ్ సింగరేణి జాతాను ప్రారంభించి కార్మిక వర్గాన్ని అయోమయానికి గురి చేస్తుందని ఆరోపించారు. ఏఐటియుసి గుర్తింపు సంఘం పదవీకాలంలో నాలుగు కార్మిక వ్యతిరేక సర్క్యులర్లు వచ్చాయని, వాటిని ఎందుకు అడ్డుకోలేకపోయారని మండిపడ్డారు. 2012, 2017 సంవత్సరాలలో ప్రాతినిధ్య సంఘంగా ఎఐటియుసి ఉన్నప్పుడు, టిఆర్ఎస్, టీబీజీకేస్ రూ. 29 వేల కోట్లు అప్పు పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వీరిద్దరూ పదవీకాలంలో ఉన్నప్పుడు డిపెండెంట్ ఉద్యోగుల పిల్లలు 300 మంది మూడు సంవత్సరాలుగా ఆర్డర్ ఇవ్వక ఇబ్బంది పడుతుంటే, జనక్ ప్రసాద్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వారందరికీ ఆర్డర్లు ఇప్పించిన మాట నిజం కాదా అని అన్నారు. గుర్తింపు సంఘం కాకున్నా, ఐఎన్టియుసి ప్రాతినిధ్య సంఘంగా కార్మికుల సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంగ్రెస్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు భీమ్రావు, సీనియర్ నాయకులు గరిగస్వామి, తిరుపతి రాజు, రవీందర్ రెడ్డి, మారేపల్లి బాబు, రౌతు సత్యనారాయణ, నంబన్న, భీమన్న, శ్రీధర్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version