క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
ఎంపీడీవో మున్వర్
కొత్తగూడ నేటిధాత్రి
కొత్తగూడ మండల కేంద్రంలోని స్పోర్ట్స్ పాఠశాల ఆవరణంలో నిర్వహించిన మండల స్థాయి సీఎం కప్ క్రీడలను ఎంపీడీవో మన్వర్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఎంపీడీవో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతమైన క్రీడాకారులను వెలికి తీసేందుకు దోహదపడుతున్నాయని ఆయన అన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడతాయని పేర్కొన్నారు.మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు పంపించేందుకు ఈ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మన్వర్ తెలిపారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో పాల్గొని మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పీఈటీలు, క్రీడా నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
