పెద్దమనుషుల ముసుగులో మోసం..?
గీత కార్మికుల భూములు, సంఘం నిధులపై ఆరోపణలు
నేటిధాత్రి, వరంగల్.
వరంగల్ నగరంలోని ఉర్సు, కరీమాబాద్ ప్రాంతాలకు చెందిన గీత కార్మికులు కొంతమంది వ్యక్తులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్దమనుషుల ముసుగులో ఒక ముఠాగా ఏర్పడి గీత కార్మికుల భూములు, సంఘానికి చెందిన డబ్బులు కాజేసి, వాటి లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారని కార్మికులు ఆరోపించారు.
ఈ విషయంపై బాధితులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను కలిసి తమ సమస్యను వివరించారు. కార్మికుల వినతిని ఆలకించిన మంత్రి, విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిసింది.
దీంతో గీత కార్మికులు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో సమూహంగా వెళ్లి ఫిర్యాదు చేశారు. బత్తిని హరి మరియు అతని ముఠా సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు కార్మికులు సంతకాలు చేసి ఫిర్యాదు సమర్పించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.
