ఉర్సే షీరీఫ్ జాతర: పశువుల సంతలో కోట్ల వ్యాపారం
◆-: జోడెడ్లకు @ రూ.3.40 లక్షలు భారీ ధర
◆-: పశువుల జాతర: రూ.5.40 లక్షల వరకు ధరలు, రైతుల ఆనందం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామ శివారులోని దర్గా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ప్రత్యేక పశువుల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దియోని, ఒంగోలు, కిల్లరి జాతులకు చెందిన ఎద్దులు, కోడెదూడలు, ఆవులు, పాడిగేదెలు అమ్మకానికి రాగా, ధరలు రూ.50 వేల నుంచి రూ.5.40 లక్షల వరకు పలికాయి. ఈ జాతరలో ఉత్తమ పశుపోషకులైన రైతులకు స్థానిక దివంగత అడివప్ప, గిరిజమ్మ జ్ఞాపకార్థం బహుమతులు అందజేశారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల వ్యాపారులు పాల్గొనడంతో పశువుల ధరలు పెరిగాయి. జాతర నిర్వాహణ కమిటీ భద్రత, తాగునీరు, పారిశుద్ద్య ఏర్పాట్లు చక్కగా నిర్వహించింది.
పశుపోషకులకు బసవ అవార్డులు
ప్రముఖ శిల్పి డాక్టర్ హోతి బస్వరాజ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉత్తమ పశు పోషకులకు బసవ అవార్డులు అందజేశారు. గత 19 సంవత్సరాలుగా ఉత్తమ పసుపు సన్మానిస్తున్నట్లు వివరించారు. రైతులను గౌరవించని లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. సల్మాన్ (జంగి), సామెల్ (గోపులారం), రాములు (సిందోల్), గోపాల్ (మనూర్), నాగభూషణం (బొడిమట్టపల్లి), నగేష్ (తుమ్మలపల్లి), సమీర్ (నాగ్వార్), పైజాన్ (హైదరాబాద్) కు చెందిన పశుపోషకులకు ఉత్తమ ధరలు రావడంతో జహీరాబాద్ డీఎస్పీ సైదా, సీఐ శివలింగం స్థానిక నాయకులతో కలిసి బసవ అవార్డులు అందజేశారు.
ఆకర్షణీయంగా పశువులకు అలంకరణ సామాగ్రి
జాతరలో ముఖ్యంగా పశువులకు అలంకరించే వస్తువులు మెడ గంటలు, పూల మాలలు, రంగుల రిబ్బన్లు, పూసల హారాలు, అలంకారపు గొలుసులు, చిన్న జెండాలు, తోరణాలు మెడపట్టి గజ్జెలు, తోక అలంకరణ తాళ్లు, రంగుల కంకణాలు, నల్ల తాళ్లు, ఎర్ర తాళ్లు, వివిధ రకాల రిబ్బన్లతో దుకాణాలు ఆకర్షణీయంగా నిలిచాయి.
