పోతన నగర్ కల్వర్టు వివాదం..

పోతన నగర్ కల్వర్టు వివాదం

స్పందించిన పోలీసులు – రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు

నేటిధాత్రి, వరంగల్

వరంగల్ నగర పరిధిలోని పోతన నగర్‌లో కొనసాగుతున్న కల్వర్టు నిర్మాణ వివాదంపై పోలీస్ శాఖ స్పందించింది. భూ బాధితులు చేసిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.

మునుపటి రోజున భూ బాధితులు కల్వర్టు విస్తరణ పేరుతో తమ ప్రైవేటు భూమిని అసమానంగా స్వాధీనం చేసుకుంటున్నారని, దళితుల వైపు ఎక్కువగా భూమి తీసుకుని, ఇతరుల వైపు తక్కువగా తీసుకున్నారని ఆరోపిస్తూ టెంటు వేసి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పోలీసులు నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల వాంగ్మూలాలు నమోదు చేసి, సంబంధిత పత్రాలు పరిశీలించినట్లు సమాచారం. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ఇక విజిలెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగి నిర్మాణ పనులపై విచారణ ప్రారంభించారు. కల్వర్టు నిర్మాణం అనుమతులు, ప్రణాళికలు, భూస్వాధీనం విధానం తదితర అంశాలపై పరిశీలన చేపట్టినట్లు తెలిసింది. రెండు వైపులా భూమి తీసుకున్న పరిమాణంపై స్పష్టతకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం.

నిర్మాణం జరిగిన ప్రదేశంలోనే ప్రత్యక్షంగా కొలతలు తీసి, స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. సంబంధిత శాఖల అధికారులను కూడా వివరణ కోరినట్లు సమాచారం.

భూ బాధితులు మాత్రం తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇరువైపులా సమానంగా భూమి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అధికారుల విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం.

భూవివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

 భూవివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. అధికారుల సర్వే.. ఉద్రిక్తత

 

మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దీంతో రెవెన్యూ అధికారులు అధికారికంగా భూ సర్వే చేపట్టడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లా రెడ్డి (Malla Reddy), మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajasekhar Reddy) మరోసారి భూమి వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా సుచిత్ర సెంటర్‌లో కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. సర్వే నంబర్ 82, 83లో 1.29 ఎకరాల్లో 33 గుంటల స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తమ భూములు కబ్జా చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇక భూ వివాదం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఈరోజు (మంగళవారం) అధికారికంగా ల్యాండ్ సర్వే చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతోంది. అయితే కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ తమ స్థలాన్ని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. రెండు వర్గాలు తమ తమ వాదనలు గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి. దీంతో సర్వే జరుగుతున్న ప్రాంతంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version