ఆ పార్టీ మద్దతుతో గెలుపు.. కాంగ్రెస్ ఖాతాలో కోహీర్ మున్సిపాలిటీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహీర్: సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పడిన కోహీర్ మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 8 వార్డులను గెలుచుకున్నప్పటికీ పూర్తిస్థాయి మెజార్టీ దక్కలేదు. ఎంఐఎం పార్టీకి చెందిన 8వ వార్డ్ కౌన్సిలర్ మహమ్మద్ రఫీ మద్దతు పలకడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 4వ వార్డ్ కౌన్సిలర్ మ్యాథరి అశోక్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. దీంతో నూతనంగా ఏర్పడిన కోహీర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది.డిప్యూటీ చైర్మన్ గా అదే పార్టీకి చెందిన 7 వార్డ్ కౌన్సిలర్ అబ్దుల్ హన్నాన్ జావిద్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎంపికైన చైర్మన్, డిప్యూటీ చైర్మన్, కౌన్సిలర్లతో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, మున్సిపల్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అశోక్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కోహీర్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి పని చేస్తానని తెలిపారు.
