చదివిన పాఠశాలపై మమకారంతో..తన కుమారునికి అదే పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించి అందరికీ ఆదర్శంగా నిలిచిన తల్లి
-తల్లిని సన్మానించిన ఉపాధ్యాయ బృందం
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
తాను పేదింటి కుటుంబంలో పుట్టినప్పటికీ..ప్రైవేట్ చదువులను చదివించలేని తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని, ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యా కుసుమం మిరిపూరి నాగరాణి అందరికీ ఆదర్శంగా నిలిచిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామానికి చెందిన మిరిపూరి మంజుల-సమ్మయ్య దంపతుల కుమార్తె నాగరాణి నిరుపేద కుటుంబంలో పుట్టింది. పేదరికం చదువుకు అడ్డం కాదనే విషయాన్ని ప్రపంచానికి చాటింది. చిన్నప్పటినుండి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత విద్యనభ్యసించింది. ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం పొందింది. ప్రస్తుతం తాను చిన్నప్పుడు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో తన కుమారునికి అడ్మిషన్ ఇప్పించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలే క్రమశిక్షణకు నిలయాలని, మనం కష్టపడి చదివితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని మిరిపూరి నాగరాణి నిరూపించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం మిరిపూరి నాగరాణిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తోటపల్లి మహేష్, ఉపాధ్యాయులు నాగేందర్, సురేందర్, శ్రీధర్, సునీతా దేవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.