ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫేర్‌వెల్ డే వేడుకలు…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫేర్‌వెల్ డే వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), నర్సంపేటలో విద్యార్థుల కోసం ఫేర్‌వెల్ డే వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బైరి సత్యనారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్. కమలాకర్, స్టాఫ్ సెక్రటరీ ఎం.ఎం.కె. రహీముద్దీన్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు, డాక్టర్ సంధ్య తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ, కళాశాల విడిచి వెళ్లే ప్రతి విద్యార్థి తన జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్య అనేది కేవలం ఉద్యోగానికే పరిమితం కాకుండా మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణ, సమాజపట్ల బాధ్యతను పెంపొందించేదిగా ఉండాలని సూచించారు.అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమపద్ధతిలో శ్రమిస్తే విజయం సాధ్యమని తెలిపారు.స్టాఫ్ సెక్రటరీ ఎం.ఎం.కె. రహీముద్దీన్ మాట్లాడుతూ, విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచి కళాశాల ప్రతిష్ఠను మరింత పెంచాలని ఆకాంక్షించారు. కెరీర్ గైడెన్స్ సెల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. సోమయ్య మాట్లాడుతూ, ఫేర్‌వెల్ అనేది విడిపోవడమే కాకుండా కొత్త జీవితానికి ఆరంభమని తెలిపారు.ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు విద్యార్థులు సమాజ సేవా దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు భావోద్వేగపూర్వక ప్రసంగాలు చేస్తూ కళాశాల అనుభవాలను, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వాన్ని స్మరించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంధ్య, డాక్టర్ భూక్యా భద్రు,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version