లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: ఎస్ఐ, క్రాంతికుమార్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం ఎస్ఐ, క్రాంతికుమార్ పటేల్ ప్రజలకు లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 28న జహీరాబాద్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని, సిద్దాపూర్, వనం పల్లి తండా, కుడు సంఘం, తుమ్మనపల్లి, ఇదులపల్లి, చిలేపల్లి, కృష్ణాపూర్, గ్రామ ప్రజలు తమ కేసులను సులభంగా పరిష్కరించుకోవాలని కోరారు. లోక్ అదాలత్ ద్వారా యాక్సిడెంట్ కేసులు, గొడవలు, చీటింగ్, చిన్నపాటి దొంగతనాలు వంటి పలు రకాల కేసుల్లో రాజీ కుదుర్చుకునే అవకాశం ఉంటుందని, కోర్టు ప్రక్రియలతో పోలిస్తే వేగంగా, తక్కువ ఖర్చుతో పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఈ నెల 28 వరకు పోలీస్ స్టేషన్లు లేదా కోర్టుకు హాజరై రాజీకి రావచ్చని, దీని ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు.
