పాఠశాలలు బలోపేతానికి సర్పంచులు కృషి చేయాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు.
బుధవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రత్యేక విద్యా వారోత్సవాల రోజు వారి కార్యాచరణ కార్యక్రమాలపై మండల విద్యాశాఖ అధికారులు, సర్పంచ్ లతో వర్క్ షాప్ నిర్వహించారు.
ముందుగా సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే దేవాలయాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద పటిష్టమైన ఆలోచనతో ముందుకు వెళుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరగాలన్న లక్ష్యంతో ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య అందించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో ఒక ప్రాథమికోన్నత పాఠశాలను ఎంపిక చేసి సెమి రెసిడెన్షియల్ పాఠశాలలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలలల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలో 200 కోట్లతో యుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి వసతి గృహల్లోని విద్యార్థులకు 200 శాతం కాస్మెటిక్ చార్జీలు, 40 శాతం డైట్ చార్జీలు పెంచినట్లు తెలిపారు. సర్పంచులు తమ తమ పరిధిలో గల పాఠశాలలను తనిఖీ చేసి విద్యాబోధన, మెనూ అమలును పరిశీలించాలని ఆయన సూచించారు. భవిష్యత్ తరాలను మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మనందరిపైందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్ కంటే ప్రభుత్వ వ్యవస్థ చాలా పటిష్టమైనదని, అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారని ఆయన తెలిపారు. పాఠశాలల్లో క్రీడా స్థలాలు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో లైబ్రరీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు పాఠనాశక్తిని పెంపొందించడమే కాకుండా ఉద్యోగాలు సాధనకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. విద్యా వ్యవస్థను బలిపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ క్రమంలో ఎక్కడైనా తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలల మీద నుండి విద్యుత్ లైన్లు వెళ్తుంటే అట్టి జాబితాను అందజేయాలని వాటిని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థుల కొరకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి అన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి రోజు చేయాల్సిన కార్యక్రమాలను నిర్దేశించినట్లు తెలిపారు. విద్య మీద సర్పంచులు ఫోకస్ పెట్టి విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన పనులు చేపట్టి పాఠశాలలను సుందరీకరణ చేసినట్లు తెలిపారు. జిల్లాలో యంగ్ ఇండియా మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఈ సంవత్సరం 10వ తరగతి, ఇంటర్ లో మంచి ఫలితాలు సాధించామని, విద్యార్థులను, ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థులు బాగా చదివి మన జిల్లాకు, రాష్ట్రానికి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు. విద్యా వైద్యంపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు ఆయన సూచించారు.
ప్రతి పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. బడిబాట కార్యక్రమంలో విద్యార్థులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్ఓ వసంతకుమారి, గ్రంధాలయాల సంస్థ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్ని మండలాల ఎంఈఓలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
