Police Bust Fake Cotton Seed Gang
నకిలీ పత్తి విత్తనాల ముఠాను పట్టుకున్న పోలీసులు
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా చెన్నూరు,భీమారం,మండల కేంద్రాల్లో నకిలీ పత్తి విత్తనాల ముఠాను సోమవారం పట్టుకున్నట్లు పోలీసులు వారు తెలిపారు.వారు తెలిపిన వివరాల ప్రకారం రెండు వేరు వేరు కేసుల్లో సుమారు
386 కిలోల ప్రభుత్వ నిషేధిత బిటి 3 పత్తి విత్తనాల పట్టుకున్నట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన ఏసీపీ కార్యలయంలో వివరాలు వెల్లడించారు.రెండు కేసుల్లో అయిదు గురు సభ్యులు ముఠాగా ఏర్పడి ఆంధ్ర ప్రాంతం నుండి నకిలీ పత్తి విత్తనాలు తీసుకువచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ముగ్గురిని అదుపులోకి తీసుకొని మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు.నకిలీ పత్తి విత్తనాల వల్ల భూమి సారవంతం కోల్పోయి పంటలు నష్టం వాటిల్లే ప్రమాదముందని,పర్యావరణం పై ప్రభావం చూపెడుతుందని అందువల్ల నకిలీ విత్తనాలు వాడవద్దని ఆయన రైతులకు సూచించారు.గతంలో కూడా నకిలీ విత్తనాలపై వ్యవసాయ శాఖ అధికారులతో కలసి రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని రైతులు ఎవరూ మోసపోవద్దని ఆయన వివరించారు.తెలంగాణ ప్రభుత్వం,పోలీసులు నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరిస్తామని పీడీ యాక్ట్ కేసులు కుడా నమోదు చేస్తామని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని శాఖ పరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.రెండు కేసుల్లో ప్రతిభ కనబర్చిన పోలీసులను డిసిపి భాస్కర్ అభినందించి వారికి రివార్డులు కూడా అందిస్తామని పేర్కొన్నారు.
