‘విద్యా నిధికి.. విరాళాలు అందించండి’
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి.
మహబూబ్ నగర్/నేటి ధాత్రి
బీఈడీ కళాశాలను అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. రూ. 2 లక్షలతో ఎస్డిఎఫ్ నిధుల ద్వారా విద్యార్థులకు నూతనంగా నిర్మించిన శౌచాలయాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థులు చదువుకుంటారని వారికి వీలైనంతవరకు సౌకర్యాలు కల్పించాలని.. అది మనందరి బాధ్యత అన్నారు. కళాశాల అతి పురాతనమైనదని, త్వరలో కళాశాలలకు పూర్తిస్థాయిలో నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు అందించామన్నారు. మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఒక్క వ్యక్తితో అది సాధ్యం కాదు కాబట్టి.. ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మహబూబ్ నగర్ విద్యానిధి ఏర్పాటు చేశామని బాధ్యత కలిగిన పౌరులు సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విద్యానిధికి సహకరించాలని చేయూత అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ విద్యా నిధి పారదర్శకంగా అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి నెల తన జీతం నుంచి రూ.లక్ష విద్యానిధిలో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. మాకు ఈరోజు చాలా శుభదినం అని మా గురించి ఆలోచించి మా బాధలు అర్థం చేసుకొని మాకు శౌచాలయాలను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం.గోవిందరాజులు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, నాయకులు ఏసు దాస్ , సుధాకర్ రెడ్డి, రామచంద్రయ్య, రాజు గౌడ్, మోయీజ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.