Scorching Heat in Parkal
పది దాటితే పరేషానే
పరకాలలో మండిపోతున్న ఎండలు
ఉదయం నుంచే ఉక్కపోతతో అవస్థలు
పరకాల,నేటిధాత్రి
పరకాల పట్టణంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.ఉదయం పది గంటలు దాటితేనే రోడ్లపై తిరగడం ప్రజలకు కష్టంగా మారుతోంది.ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటడంతో వేడిగాలులు,ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.అత్యవసర పనులు ఉన్నవారు తప్ప మిగతావారు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కూలీ కార్మికులు,వృద్ధులు, చిన్నపిల్లలు ఎండల ప్రభావంతో అలసటకు గురవుతున్నారు.చల్లని పానీయాలు,కొబ్బరి బోండాలు,జ్యూస్ కేంద్రాల వద్ద ప్రజల రద్దీ పెరుగుతోంది. వైద్యులు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ,ఎక్కువగా నీరు తాగాలని,మధ్యాహ్న సమయంలో బయట తిరగవద్దని హెచ్చరిస్తున్నారు.
