No Need for Farmers to Worry: MLA
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి
బెల్లంపల్లి,నేటిధాత్రి:
బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామపంచాయతీలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్లు కొనుగోలు కేంద్రాన్ని శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి,జిల్లా అడిషనల్ కలెక్టర్ మనోజ్ కుమార్ తో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..వడ్లు కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.అలాగే లారీల కోసం ఆలస్యం చేయకుండా తక్షణం ఏర్పాటు చేయాలని,సంచుల విషయంలో కూడా ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిగా ఉండాలని చెప్పారు.హమాలీలు, కూలీల సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.రైతులు,అధికార యంత్రాంగం పరస్పరం సమన్వయంతో వ్యవహరిస్తూ కొనుగోలు ప్రక్రియను సాఫీగా సాగించేలా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు,సంబంధిత అధికారులు,రైతులు పాల్గొన్నారు.
