Admissions Open in Veda Patashala
వేద పాఠశాలలో దరఖాస్తుల స్వీకరణ..!
అన్ని వర్గాల వారు అర్హులే
విద్య, భోజనం, వసతి అన్నీ ఉచితమే
ఆఫ్లైన్ విధానంలో స్వీకరణ
వేదంతో పాటు పాఠశాల విద్య
జహీరాబాద్ నేటి దాత్రి:
సంగారెడ్డి జిల్లా బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ వైదిక పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వ్యవస్థాపకులు పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్, ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో వేద విద్యను అభ్యసించేందుకు 5వ తరగతి ఉత్తీర్ణులై, 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలు అర్హులని పేర్కొన్నారు. వేదం పఠించే విద్యార్థులకు ఉచిత బోధనతో పాటు భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఆరేళ్లపాటు శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.ప్రవేశ, వర, ప్రవర కోర్సులు (అర్చక, పౌరోహిత్య, షోడశ సంస్కార విద్య) ద్వారా వేదాంత విజ్ఞానం బోధిస్తారని తెలిపారు. విద్యార్థులకు వేదాంతం, న్యాయం, యోగదర్శనం, ధ్యానం, భజన, గ్రంథపఠనం తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని వెల్లడించారు. వేద విద్యతోపాటు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్ విధానంలో మాత్రమే స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు బర్దిపూర్ ఆశ్రమ కార్యాలయాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.మరిన్ని వివరాలకు:
📞 8639258008, 9177259329
