
ప్రకృతి నియమాలను నిరంతరం ఆచరించాలి…
వాస్తవికత,శాస్త్రీయత, మానవీయ విలువల ఆధారంగా జీవించాలి…
గుడ్డిగా దేన్ని నమ్మకూడదు…
నిరంతరం పరిశీలించాలి, పరీక్షించాలి, ఫలితాలను సరిచూసుకోవాలి…
మనిషి మానసిక భావనలో దైనందిన జీవితంలో ప్రకృతి ఆధారంగా మార్పు రావాలి…
విశ్వంలో జీవం పుట్టుక, మనుగడకు గాలి,నీరు,భూమి, అగ్ని, ఆకాశం అత్యంత అవసరం…
విశ్వ జంపాల, న్యాయవాది మరియు విశ్వ సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు…
నేటి ధాత్రి -గార్ల:-
మనిషి మానసిక భావనలో,దైనందిన జీవితంలో ప్రకృతి ఆధారంగా మార్పు రావాలని విశ్వ సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు, న్యాయవాది విశ్వ జంపాల అన్నారు.శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రకృతి- పరిరక్షణ విద్యార్థుల పాత్ర, పంచ కారకాలు సృష్టి కి మూలాలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ జంపాల మాట్లాడుతూ,అమానవీయ విలువలతో కూడిన మానవ జీవన సంస్కృతి, నాగరికతలను భూమి,గాలి, నీరు,అగ్ని,ఆకాశం అనే పంచభూతాల సైద్ధాంతిక అవగాహనతో మానవీకరించాలని అన్నారు. విశ్వంలో జీవం పుట్టుక, మనుగడకు గాలి,నీరు, భూమి, అగ్ని,ఆకాశం అత్యంత అవసరం అన్నారు. నేటి నాగరిక మానవులు అనాగరికంగా వ్యవహరిస్తూ ప్రకృతిలోని వనరులను ధ్వంసం చేస్తూ విధ్వంస సంస్కృతికి వారసులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నేటి మానవులలో కొందరు అత్యాశతో కూడిన సంపద, ఆధిపత్యం,అధికారం కోసం సాటి మానవులతో విపరీతమైన ఘర్షణ పడుతున్నారని అన్నారు.
అ శాస్త్రీయతను,శాస్త్రీయతగా ప్రజల చేత నమ్మిస్తూ, సకల జీవరాశులకు,సమస్త ప్రకృతికి వినాశకారిగా మారుతున్నారని అన్నారు. పంచభూతాలే సృష్టి మూలాలు,పంచభూతాలే పదార్థం, పదార్థమే యదార్థం, యదార్థమైనదే ప్రకృతి అని అన్నారు. ప్రకృతి నియమాలను ఉల్లంఘించి, మానవులు సృష్టిస్తున్న విధ్వంసానికి నిరంతరం భారీ మూల్యం చెల్లిస్తున్నారు అని అన్నారు.మానవులు ప్రకృతి సహజ వనరుల పరిరక్షణకు బద్ధులై ఉండాలి,అత్యాశతో కూడిన అనవసర వినియోగం, విధ్వంసానికి పూనుకోవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో మోటివేషన్ స్పీకర్ వజ్రం నాగేశ్వరరావు,ఎన్ఎస్ఎస్ విభాగం బాధ్యులు వేముల రవీందర్,డాక్టర్ శ్రీనివాస్,జి. సోమన్న, కళాశాల విద్యార్థులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.