నాకు నటించడమే రాదన్నారు

‘శతమానం భవతి’, కార్తికేయ 2’ లాంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు అనుపమ పరమేశ్వరన్. ఆమె నటించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే…
‘శతమానం భవతి’, కార్తికేయ 2’ లాంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు అనుపమ పరమేశ్వరన్. ఆమె నటించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే మలయాళ చిత్రం ఈనెల 27న విడుదలవుతోంది. ఇందులో లాయర్గా సురేశ్ గోపీ నటించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనుపమ మాట్లాడుతూ ‘నాకు నటన రాదంటూ చాలా మంది ట్రోల్ చేశారు. అయినా దర్శకుడు ప్రవీణ్ నాకు అవకాశం ఇచ్చారు. ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ వంటి గొప్ప చిత్రంలో ఎంపిక చేశారు. నాపై నమ్మకంతో ఇలాంటి పాత్రను ఇవ్వడమే నాకు దక్కిన విజయంగా భావిస్తున్నాను. ఇక నుంచి ప్రేక్షకులకు నచ్చే సినిమాలు మాత్రమే అంగీకరించాలని నిర్ణయించుకున్నా. కొవిడ్ సమయంలో నా కెరీర్ పరంగా, జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను’ అని చెప్పారు. కాగా, అనుపమ వ్యాఖ్యలపై సురేశ్ గోపీ స్పందించారు. ఒక నటిపై వివక్షను ప్రదర్శించడం మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి కాదని అన్నారు. ‘అనుపమ మాట్లాడిన మాటలు ఆమె హృదయాంతరాళం నుంచి వచ్చాయి. గతంలో నటి సిమ్రాన్ విషయంలోనూ ఇదే విధంగా జరిగింది. మలయాళ చిత్రపరిశ్రమ ఆమెను చిన్నచూపు చూసి ఇండస్ట్రీ వదిలిపోయేలా చేసింది’ అని అన్నారు.