‘‘నేటిధాత్రి’’, ఎఫెక్ట్
`మల్టీ టాలెంటెడ్ మహా మాయగాడు గుమస్తా మిల్లర్ ‘‘జగన్’’ మరో కుంభకోణం!!
`కలెక్టర్ కళ్ళు కప్పి.. జగన్ కు అప్పజెప్పి.
`సన్నాలకు జగన్ కన్నం!
`వడ్లన్నీ జగనొక్కడే మింగుతున్నాడు!!
`అధికారులు ఆ ఒక్కడి మిల్లులోనే కుక్కుతున్నారు!!
`కిలాడీ జగన్ కనుసన్నల్లోనే అధికారులు కంపు కంపు చేస్తున్నారు
`జగన్ మోసాలను కళ్లు మూసుకొని చూస్తున్నారు
`రైతుల ‘‘ట్రక్ షీట్ల’’ లను సొమ్ము చేసుకుంటున్నాడు రైతులను ముంచి కోట్లు
మూటగట్టుకుంటున్నాడు
`మిల్లుల మురికి నీరు వరద కాలువల్లో కలుపుతున్నాడు
`పొల్యూషన్ అధికారుల నోరు నోట్లతో మూయిస్తున్నాడు
`ఇరిగేషన్ అధికారులను కనుసైగతో కమ్మేస్తున్నాడు
`‘‘జేసి’’ని కూడా చిటికెన వేలు మీద ఆడిస్తా అంటున్న జగన్
`అధికారులందినీ గుప్పిట్లో పెట్టుకున్నారు
`మిల్లింగ్లో మాయా ప్రపంచం సృష్టించుకున్నాడు
`గుమస్తా పని చేసి గూడుపుఠాణి నేర్చుకున్నాడు
`సన్నాలొద్దని గాయి గాయి చేశాడు
`ఇప్పుడు సన్నాలను రా మిల్లులకు కాకుండా చేస్తున్నాడు
`అటు రైతులను నిండా ముంచుతున్నాడు
`ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు
`కులం పేరు అడ్డం పెట్డుకొని కుటిల నీతికి పాల్పడుతున్నాడు
`మహా మాయగాడుగా వడ్లన్నీ మాయం చేస్తున్నాడు
`‘‘నేటిధాత్రి’’ కథనానికి ఖమ్మం అధికారులు స్పందించారు
`హన్మకొండ అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు
`ఖమ్మం జిల్లా వడ్లను కూడా గుమస్తా జగన్కే కట్టబెట్టారు
`ఎంక్వౌరీకి ఆదేశించినా హన్మకొండ అధికారులు కళ్లు తెరవడం లేదు
`ఖమ్మం జెసి నుంచి రికవరీ ఆర్డర్లు వచ్చినా హన్మకొండ అధికారులు మేలుకోవడం లేదు
హైదరాబాద్,నేటిధాత్రి:
కొందరికి కాలం కలిసి వస్తుంది. మరి కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. మరి కొందరకి పేరు కలిసివస్తుంది. రాజపకీయం కలిసి వస్తుంది. కాని ఓ వ్యక్తికి మాత్రం అన్నీ కలిసి వస్తాయి. ఏక కాలంలో అన్నీ కలిసివస్తుంటాయి. అలా పుర్కర కాలం నుంచి సివిల్ సప్లయ్ శాఖను గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంచెలంచెలుగా కాదు, ఏకంగా ఒక్కసారే ఎదిగాడు. మోసాలకు వెన్నతో పెట్టిన విద్య అనే పదానికి నిర్వచనమయ్యాడు. అందరూ గుమస్తా జగన్మోహన్ రావు అంటుంటారు. పేరు ముందు వుండే కులం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. రాజకీయం వెన్నంటే వున్నట్లు చేసుకున్న ప్రచారం కలిసి వచ్చింది. అందుకు సివిల్ సప్లై శాఖ కూడా అండదండలు అందించింది. సహజంగా ఎవరికైనా వారి అదృష్టమే కలిసి వస్తుంది. కాని ఈ వ్యక్తికి ఇతరుల అదృష్టం కూడా లాక్కునేంత శక్తి వుంది. అందుకే మల్టీ టాలెంటెడ్ మాయగాడు అని అందరూ అంటుంటారు. ఒక గుమస్తా నుంచి ఏకంగా మిల్లర్గా ఎదగడమే కాదు, బినామీలతో మిల్లర్ల వ్యవస్ధను సృష్టించుకున్నాడు. మిగతా మిల్లర్ల నోరు కొడుతున్నాడు. ఇతర మిల్లర్లకు రావాల్సిన వడ్లను కొల్లగొడుతుంటాడు. అధికారులను పూర్తిగా గుప్పిట్లో పెట్టుకున్నాడు. వారి బలహీనతలను తాను సొమ్ము చేసుకుంటున్నాడు. తోటి మిల్లర్లకు అన్యాయం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు. రైతులను నిండా ముంచేస్తున్నాడు. పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బ తీస్తున్నాడు. సాగు నీటిని కలుషితం చేస్తున్నాడు. ఎన్ని రకాలా మోసాలు చేయాలో తెలుసుకున్నాడు. ఆచరించి చూపిస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన మరో మోసం, ఒక రకంగా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హన్మకొండ జిల్లా జాయింట్ కలెక్టర్ నెల రోజుల పాటు సెలవుల్లో వెళ్లారు. ఇదే అదునుగా సివిల్ సప్లై శాఖ ఉద్యోగులతో సహకారంతో ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన సన్నాలను తను సొంతం చేసుకున్నాడు. నిజానికి అవి హన్మకొండ జిల్లాకు చెందిన ఇతర మిల్లులకు కేటాయించారు. ఆ మిల్లులకు కాదని, రాత్రికి రాత్రి తన చాణక్యం ప్రదర్శించి, వాటిని తన మిల్లులకు మళ్లించుకున్నాడు. కలెక్టర్కు తెలియకుండానే సివిల్ సప్లై శాఖ అధికారులు సహకరించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమింటే ఈ జగన్కు వున్నవి బాయిల్డ్ రైస్ మిల్లులు. గతంలో సన్నాలు తీసుకొమ్మని ప్రభుత్వం ఒత్తిడి చేసినా వద్దని వారించాడు. ప్రభుత్వాన్నే ఎదిరించాడు. మాకు దొడ్లు వడ్లు మాత్రమే కావాలిన మొండికేశాడు. సన్నాల వల్ల తాము ఎంతో నష్టపోతామని, తాము నష్టాల బారిన పడిపోతామని అనేవాడు. ఇదే విషయంలో ఒకటి, రెండు సార్లు జాయింట్ కలెక్టర్ సమావేశానికి హజరుకాలేదు. కొన్ని సార్లు హజరైనా తన నిరసన తెలియజేస్తూ వెళ్లిపోయేవాడు. తమకు సన్నాలు వద్దని సమావేశంలో మధ్యలోనే లేచి వెళ్లిపోయేవాడు. అలాంటి జగన్ ఇప్పుడు సన్నాలు మాత్రమే కావాలంటున్నాడు. ఆయనకు రా రైస్ మిల్లులు లేవు. కాని సన్నాలు కావాలంటున్నాడు. ఇతర రా రైస్ మిల్లులకు చెందాల్సిన సన్నాలను కూడా లాగేసుకుంటున్నాడు. ఖమ్మం నుంచి 50 లారీల వడ్లు హన్మకొండ జిల్లాకు వచ్చాయి. వాటిని ఇతర మిల్లుకు అదికారులు కేటాయించారు. అయినా వాటిని తన మిల్లులకు మళ్లించుకున్నాడు. ఇంత వరకు బాగానే వుంది. కాని ఖమ్మం జిల్లానుంచి వచ్చిన వడ్లలలో సుమారు 2వేల బస్తాలు మాయం చేశాడు. తప్పుడు లెక్కలు చూపించాడు. వడ్లు తీసుకొని, బియ్యం చేసే సరఫరాకు పెద్ద తేడాను తెలివిగా చూపించాడు. ఇది అధికారులు గమనించారు. దాంతో ఖమ్మం అధికారులు వెంటనే అలెర్టయ్యారు. ఇక్కడ ఖమ్మం జాయింట్ కలెక్టర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. ఖమ్మం జిల్లా నుంచి పంపిన సన్నాల బస్తాల మీద తూకం రాయించారు. అక్కడ జగన్ దొరికిపోయారు. ఇచ్చిన సన్నాలుకు, జగన్ మిల్లులనుంచి వెళ్లిన బియ్యానికి పొంతన లేదు. దాంతో కమీషనర్ కార్యాలయానికి సమాచారం అందించి, ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఏఏ మిల్లు ఎంత మోసం చేసిందనే విషయాన్ని జాయింట్ కలెక్టర్ స్పష్టంగా నోటీసులో పేర్కొన్నారు. అవి వసూలు చేస్తున్నారు. ఇలా సివిల్ సప్లైయ్ని పుష్కర కాలంగా మోసం చేస్తూ వస్తున్న జగన్ కిలాడీ వేషాలు అనేకం వున్నాయి. ఆయన చేస్తున్న ఘనకార్యాలు తక్కువేం కాదు. రైతులు తెచ్చే వడ్లకు ట్రక్ షీట్ల పేరుతో ప్రభుత్వం రవాణ చార్జీలు చెల్లిస్తుంది. అలా ప్రతి సీజన్లో కొన్ని మండలంలోని రైతులందరికీ ఆ సొమ్ము చేరాలి. కాని జగన్ ఆ వడ్లకు సంబందించిన ట్రక్ షీట్ల పేరుతో వచ్చే సొమ్మును మింగేస్తుంటాడు. ఆ సొమ్ము వెలల్లోనో, లక్షల్లోనో కాదు, ఏకంగా కోట్లలో వుంటుంది. అలా రైతులకు రావాల్సిన రవాణ ఖర్చులు మొత్తం తనఖాతాలోనే వేసుకుంటాడు. రైతుల చేత మాత్రం సంతాకాలు తీసుకుంటుంటుంటాడు. ఇలా ప్రతిసీజన్లో కోట్ల రూపాయల గోల్ మాల్ చేస్తున్నాడు. జిల్లాలో అందరికీ అందాల్సిన సన్నాలన్నింటినీ ఈసారి సివిల్ సప్లై అదికారులు జగన్ మిల్లులకే అప్పగిస్తున్నారు. మిగతా మిల్లర్లకు మొండి చేయి చూపిస్తున్నారు. అయినా ఆ మిల్లులను సక్రమంగా నడిపిస్తున్నాడా? అంటే అదీ లేదు. సహజంగా బాయిల్డ్ మిల్లులకు నీటి శుద్ద ప్లాంట్లు వుంటాయి. జగన్కు చెందిన మిల్లులకు కూడా వున్నాయా? అంటే వున్నాయన్నట్లు వున్నాయి. అవి పనిచేస్తున్నాయా? అంటే తూతూ మంత్రంగా పనిచేస్తాయి. కాని వాటి పనితీరుపై అధికారుల పర్యవేక్షణ ఎప్పుడూ వుండదు. కాని అంతా బాగుందనే అదికారులు రిపోర్టులిస్తుంటారు. మరి నిజమేనా? అని ఆరా తీసేవారే లేకుండాపోయారు. బాయిల్డ్ మిల్లులో వడ్లు ఉడకపెట్టడానికి పెద్దఎత్తున నీటిని వినియోగిస్తారు. ఆ నీటిలో కొన్ని కెమికల్స్ కూడా మిక్స్ చేస్తారు. వడ్లను ఉడకపెడుతుంటారు. ఆ తర్వాత ఆ నీళ్లను బైటకు వదిలేస్తారు. అలా బైటకు పంపే నీరు ఎంతో దుర్గంధంతో వుంటుంది. ముక్కు పుటాలు అదిరిపోయేంత ధుర్గంధం వెదజల్లుతుంది. అలాంటి నీటిని మిల్లు పరిసరాల్లో వుండే నీటి శుద్ది ప్లాంటులోకి పంపించాలి. ఆ నీటిని శుద్ధి చేసి, బైటకు వదిలేయాలి. కాని జగన్కు చెందిన మిల్లుల నుంచి వెలువడిన ఆ నల్లని రంగుతో, దుర్గంధంతో కూడిన నీటిని మిల్లుల వెనక నుంచి వెళ్లే సాగు నీటి కాలువలో కలిపేస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా సాగుతోంది. కాని అదికారులు అటు వైపు వెళ్లరు. చూడరు. మిల్లుపై చర్యలు తీసుకోరు. ఎందుకంటే మిల్లుల వెనక నుంచి సాగు నీటి కాలువ వెళ్తుందని వాళ్లకు తెలుసు. ఆ కాలువలోకి జగన్కు చెందిన మిల్లుల నీరు వెళ్లి ఆ కాలువలో చేరుతుందని తెలుసు. కాలువలో నీరంతా కలుషితమైపోతుందని తెలుసు. ఆ కాలువ ద్వారా వెళ్తున్న కెమికల్తో కూడిన మురుగునీరు పక్కనే వున్న చెరువులో చేరుతుందని తెలుసు. ఆ మిల్లుల వ్యర్దాల నీరు చెరువులోకి చేరడం వల్ల చేపలు చనిపోతున్నాయని తెలుసు. ఆ చెరువు నుంచి మరో చెరువుకు అదే నీరు వెళ్లి చేరుతుందని తెలుసు. అయినా అదికారులు కదిలింది లేదు. మిల్లుల మీద చర్యలు తీసుకున్నది లేదు. సరే ఇరిగేషన్ శాఖ అంటే పట్టించుకోలేదు. కాని పర్యావరణానికి హనీ కలిగే ఏ సంస్ధనైనా నిర్ధాక్షిణ్యంగా నిలిపివేసే శక్తి, హక్కు వున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుందనేది కూడా ప్రశ్నగా మిగిలిపోయింది. ఒక రోజో, రెండు రోజులో కాదు, నెలలు అసలే కాదు. ఏకంగా సంవత్సరాల తరబడి ఆ మిల్లులనుంచి వ్యర్ధాలన్నీ సాగు నీటి కాలువలోకి పంపిస్తున్నారు. పర్యావరణం పాడౌతోంది. నీరు కాలుష్యమైపోతోంది. మిల్లుల పరిసరాల్లో పెద్దఎత్తున దుర్గంధం వెదజల్లబడుతోంది. కాని అధికారులు ముక్కు మూసుకుంటున్నారు. అప్పుడప్పుడు మిల్లుల తనిఖీకి వచ్చినప్పుడు కళ్లు కూడా మూసుకుంటున్నారు. మిల్లుల్లో వుండాల్సిన నీటి శుద్ది ప్లాంటు కళ్లముందు పని చేయడం లేదని కనిపిస్తున్నా..బాగుందనే రిపోర్టు రాసేస్తుంటారు. పక్కనే సాగు నీటి కాలువను తొంగి కూడా చూడరు. అందులో కలుస్తున్న నీటిని పట్టించుకోరు. ఇలా వ్యవస్ధలను, అధికారులను గుప్పిట్లో పెట్టుకొని చేయాల్సినన్ని దర్మార్గాలు జగన్ చేస్తున్నాడు. జాయింట్ కలెక్టర్ ఏం చేయగలడని కూడా తోటి మిల్లర్ల ముందు సవాలు కూడా విసురుతుంటాడని విశ్వసనీయ సమాచారం. మరి ఇప్పుడు సెలవులు ముగించుకొని జాయింట్ కలెక్టర్ వస్తున్నారు. ఇప్పటికైనా జగన్ మీద చర్యలు తీసుకుంటారా? జగన్ చేసిన వ్యాఖ్యలు నిజం చేస్తారా? అన్నది వేచి చూడాలి.